Opinion Poll: 40ఏళ్ల సంప్రదాయానికి తెర: కేరళలో మళ్లీ పినరయి విజయన్ సర్కారే, బీజేపీకి థర్డ్ ప్లేస్
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏషియానెట్ న్యూస్-సీఫోర్ సర్వే ఓపినియన్ పోలీస్ విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) మరోసారి సాధారణ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది.
40ఏళ్ల సంప్రదాయానికి తెరపడనుంది?
కాగా, 1980 నుంచి కూడా కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారం చేపట్టకపోవడం గమనార్హం. కేరళ ఓటర్లు ఎప్పుడూ ఒకసారి ఎల్డీఎఫ్.. మరోసారి యూడీఎఫ్ ప్రభుత్వాలకు అవకాశం ఇస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాత్రం ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి వస్తే 40 ఏళ్ల సంప్రదాయానికి తెరపడినట్లే అవుతుంది.
సాధారణ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి పినరయి విజయన్
ఏషియానెట్ న్యూస్-సీఫోర్ సర్వే ప్రకారం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఫ్ సుమారు 72-78 స్థానాలను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లున్నాయి. మేజిక్ ఫిగర్ 71 కంటే స్వల్పంగా ఎక్కువ సీట్లు అవకాశం ఉందని వెల్లడించింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(యూడీఎఫ్)కు 59-65 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువ సీట్లే వచ్చాయి. 2016లో యూడీఎఫ్ 47 స్థానాలను దక్కించుకుంది. ఇక బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్(ఎన్డీఏ) 3-7 స్థానాలతో మూడోస్థానాన్ని దక్కించుకుంటుంది.
పినరయి విజయన్ కే పట్టం కట్టిన కేరళ ప్రజలు
ఉత్తర, దక్షిణ కేరళలో ఎల్డీఎఫ్ తన ప్రభావాన్ని చూపగా.. యూడీఎఫ్ కేరళ సెంట్రల్లో తన ప్రభావాన్ని చూపనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ను మరోసారి చూడాలని 39 శాతం కోరుకుంటుండగా, 18 శాతం మంది కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ఊమెన్ చాందీ కావాలన్నారు. ఇక తిరువనంతపురం ఎంపీ శశిథరూర్కు ఈ అంశంలో 9 శాతం ఓట్లు వచ్చాయి. ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజకు 7 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ప్రతిపక్షనేత రమేష్ చెన్నితల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ను సీఎం కావాలనుకునేవారి శాతం 6గా ఉంది.
శబరిమల అంశం తప్ప.. అన్నీ ఓకే
శబరిమల ఉద్యమాన్ని నియంత్రించడంలో ఎల్డీఎఫ్ సర్కారు విఫలమైందని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బాగా పనిచేసిందని 34 శాతం మంది, పెన్షన్లపై 27 శాతం మంది, సంతృప్తి వ్యక్తం చేశారు. గత జూన్ నిర్వహించిన సర్వేలోనూ ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందని ఇలాంటి సర్వేనే తేల్చింది. ఇటీవల జరిగిన పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం గమనార్హం.