రూ. 5.60కోట్ల లంచం తీసుకున్న బీజేపీ నేత: ఆ పార్టీ దర్యాప్తులోనే తేలింది!
ఓ మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నుంచి అనుమతి ఇప్పిస్తానంటూ ఓ వ్యాపారవేత్త నుంచి కేరళకు చెందిన ఓ బీజేపీ నేత రూ. 5.60కోట్లు లంచం తీసున్నారు.
తిరువనంతపురం: ఓ మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నుంచి అనుమతి ఇప్పిస్తానంటూ ఓ వ్యాపారవేత్త నుంచి కేరళకు చెందిన ఓ బీజేపీ నేత రూ. 5.60కోట్లు లంచం తీసున్నారు. మీడియానో, ఇతర రాజకీయ పార్టీల నేతలో చేసిన ఆరోపణ కాదు ఇది. ఏకంగా బీజేపీ దర్యాప్తు బృందం జరిపిన విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.
అయితే, ఈ బీజేపీ నేతపై పార్టీ దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక కాస్తా మీడియాకు లీకైంది. దీంతో కేరళలో ఈ విషయంపై రచ్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని ప్రత్యర్థి పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అవినీతి రహిత పాలన అందిస్తున్నామని మోడీ చెబుతున్నారని, అయితే, ఈ బీజేపీ నేత చేసిన పనేంటని వారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ అయిన ఆర్ఎస్ వినోద్.. వర్కలలోని ఎస్ఆర్ ఆస్పత్రికి కాలేజీ హోదా కల్పించేందుకు ఈ మేరకు లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలో వినోద్పై బీజేపీ అంతర్గతంగా జరిపిన దర్యాప్తు బృందం నివేదికను ఆ పార్టీలోని అసమ్మతి వర్గం మీడియాకు లీక్ చేయడంతో ఈ వ్యవహారం బయటికి పొక్కింది. కాగా, ఈ విషయంపై తాము పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేస్తామని ప్రత్యర్థి పార్టీల నేతలు అంటున్నారు.
గురువారం ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ కేరళ ప్రధాన కార్యదర్శి శోభా సురేంద్రన్.. ఈ నివేదికను పార్టీ నాయకత్వానికి తెలియజేయాల్సి ఉందని చెప్పారు. ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. లీకేజీ వ్యవహారంపైనా తమ పార్టీలో అంతర్గత విచారణ జరుపుతామని తెలిపారు.