మలప్పురం పేలుడు: లభించిన పెన్డ్రైవ్లో ప్రధాని, కీలక నేతల ఫొటోలు
తిరువనంతపురం: కేరళలోని మలప్పురం న్యాయస్థానాల సముదాయం సమీపంలో గత మంగళవారం జరిగిన పేలుడుకు సంబంధించి ఆ ప్రదేశంలో పోలీసుల దర్యాప్తు బృందం ఒక పెన్డ్రైవ్ను స్వాధీనం చేసుకుంది. అందులో ప్రధాని నరేంద్ర మోడీ, కొందరు కేంద్ర మంత్రులు, బిజెపి నేతల ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.
అంతేగాక, దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులకు కుట్రలు పన్నినట్లు పెన్డ్రైవ్లో సమాచారం ఉందని దర్యాప్తు అధికారుల్లో ఒకరైన థ్రిసూర్ రేంజి ఐజీపీ అజిత్ కుమార్ తెలిపారు.
కలెక్టేరేట్లో భారీ శబ్ధంతో పేలుడు: బిన్లాడెన్ ఫొటో లభ్యం
ఘటన స్థలంలో కొన్ని కరపత్రాలు, ఒసామా బిన్ లాడెన్ ఫొటో, ఉద్యమ పునాది అనే అర్థం వచ్చేలా రాసిన పదాలతో ఒక చిన్న అట్టపెట్టెను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత చిత్రపటం(మ్యాప్)తో పాటు దేశంలో ఇటీవలి పరిణామాలకు సంబంధించిన కొన్ని విషయాలు కరపత్రాల్లో రాసి ఉన్నట్లు ఐజీపీ తెలిపారు.
ఆవు మాంసం తిన్నందుకు యూపీలో మహమ్మద్ అఖ్లాక్ను హతమార్చిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కరపత్రాల్లో ఉంది. ఘటన స్థలిని జాతీయ దర్యాప్తు సంస్థ బృందం(ఎన్ఐఏ) కూడా పరిశీలించింది. ఎన్ఐఏ కూడా ఈ కేసును విచారిస్తోంది. కాగా, మలప్పురం పేలుడు ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.