స్థానిక సంస్థల ఎన్నికలు: చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఓటే గల్లంతు!
తిరువనంతపురం: ఓ వైపు డిసెంబర్ 8న దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు భారత్ బంద్ పిలుపునిచ్చిన సమయంలోనే కేరళ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పత్నం, తిట్ట, అలప్పుజ, ఇడుక్కి జిల్లాల్లోని 395 స్థానిక సంస్థల్లో 6910 వార్డుల్లో మంగళవారం పోలింగ్ జరిగింది.
ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ బరిలోకి దిగాయి. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తిరువనంతపురంలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకుడు కుమ్మానం రాజశేఖరన్ ఓటు వేశారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజంయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో తమ పేర్లు ఓటరు జాబితాలో లేవంటూ ఓటర్లు వాపోతుంటారు. కానీ, కేరళలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితాలో కేరళ ఎన్నికల ముఖ్య అధికారి పేరే లేకపోవడం గమనార్హం. ఏకంగా ఎన్నికల ముఖ్య అధికారి తీక రామ్ మీనా పేరే కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తీక రామ్ మీనా స్వస్థలం రాజస్థాన్లోని సవాయి మాధోపూర్. ప్రస్తుతం ఆయన తిరుపనంతపురంలోని జగతి ప్రాంతంలో ఉన్న మిలీనియం అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అయితే, ఈ అపార్ట్మెంట్లో చాలా మంది ఓటర్ల జాబితాలో రాలేదని తెలిసింది. ఈ ఎన్నికల ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘమే తయారుచేసింది. అయితే, తనతోపాటు మరికొందరి పేర్లు ఈ జాబితాలో కనిపించలేదని మీనా తెలపడం గమనార్హం.