నా ఎదుగుదల, పతనానికి సీఎం కారణం: సరితా
త్రివేండ్రం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై సోలార్ స్కాం నిందితురాలు సరితా నాయర్ (36) ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకు సరితా నాయర్ ఏదో ఒక బాంబు పేల్చుతున్నది. ఈమె ఆరోపణలతో కేరళ అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
కొచ్చిలో జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరైన సరితా నాయర్ ఊమెన్ చాందీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన కంపెనీ ఎదుగుదలకు, పతనానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీనే కారణం అని చెప్పింది.
సరితా నాయర్ వ్యాపార భాగస్వామి, సోలార్ స్కాం కేసులో నిందితుడు బిజూ రాధకృష్ణన్ జ్యుడిషియల్ కమిషన్ ముందు ఇవే ఆరోపణలు చేశాడు. సరితా నాయర్ ఓ జాతీయ టీవీ చానెల్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చాందీ మీద ఆరోపణలు చేశారు.
తాను కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి రూ.1.9 కోట్లు చెక్ ల రూపంలో లంచం ఇచ్చానని చెప్పారు. నేను ముఖ్యమంత్రి సహాయక నిధికి ఆ డబ్బులు ఇవ్వలేదని, అది లంచం అని సరితా నాయర్ స్పష్టం చేసింది.
సోలార్ స్కాం కేసు విచారిస్తున్న రిటైడ్ జడ్జి ఎదుట తాను ఇదే విషయం చెప్పానని సరితా నాయర్ అన్నారు. విచారణ చేస్తున్న రిటైడ్ జడ్జి ముందు ఇప్పటికే సీఎం ఊమెన్ చాందీ హాజరైనారు. దాదాపు 10 గంటల పాటు తన వాదన వినిపించుకున్నారు.
సోలార్ స్కాం కేసులో 2013లో సరితా నాయర్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి చాందీ, ఇద్దరు రాష్ట్ర మంత్రుల మీద ఆమె ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఒక్క సీఎంకే తాను రూ. రెండు కోట్లు లంచం ఇచ్చానని చెబుతున్నారు.