ఓటు వేయడానికి అరగంటకు పైగా క్యూలో నిల్చున్న ముఖ్యమంత్రి
Recommended Video
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా మూడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల వరకూ ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటలు చెప్పుకోదగ్గ స్థాయిలో నమోదు కాలేదు. కర్ణాటకలో 14, కేరళలో 20 లోక్ సభ స్థానాలతో పాటు అసోం, బిహార్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, గోవా, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దాద్రా నగర్, హవేలీ, డయ్యూ డామన్ లల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
క్యూలో నిల్చున్న పినరయి
సీపీఎం కురువృద్ధుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లా పినరయి గ్రామంలో ఆయన ఈ ఉదయం ఓటు వేశారు. దీనికోసం అరగంటకు పైగా ఆయన సాధారణ ఓటర్లతో పాటు క్యూలో నిల్చున్నారు. పినరయి గ్రామంలోని ఆర్సీ అమల బేసిక్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆయన ఓటు వేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజధాని భుబనేశ్వర్ లో ఓటు వేశారు.
తొలి రెండుగంటల్లో మందకొడిగా..
12 రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటకే పోలింగ్ మొదలైనప్పటికీ.. ఓట్ల శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. చాలా ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా ఆరంభమైంది. మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు కనీసం 10 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. అనంతరం.. క్రమంగా పోలింగ్ పుంజుకొంది.