అదంతా రాజకీయ కుట్ర.. కేరళ బంద్ పై భగ్గుమన్న సీఎం
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో చేపట్టిన కేరళ బంద్ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బంద్ పై తీవ్రస్థాయిలో స్పందించిన సీఎం పినరయి విజయన్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై మండిపడ్డారు. అనవసరంగా నిరసనలకు దిగుతూ కేరళను రణరంగంలా మారుస్తున్నారని ఆరోపించారు.
సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘించినట్లే..!
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించారనే కారణంతో ఆందోళనలకు దిగడం సరికాదని మండిపడ్డారు సీఎం. అది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లే అవుతుందని ఆరోపించారు. శబరిమలకు వచ్చే భక్తులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని. అదే క్రమంలో ఆ ఇద్దరు మహిళలకు ప్రొటెక్షన్ ఇచ్చినట్లు తెలిపారు. భద్రత కోసం వారిద్దరు పోలీసులను ఆశ్రయించడంతో.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు వారు రక్షణ కల్పించినట్లు చెప్పారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో ఆ ఇద్దరు మహిళలకు అయ్యప్ప భక్తులు కూడా సాయం చేశారని ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారనే వార్త వైరల్ కావడంతో ఆందోళనలు మొదలైనట్లు చెప్పుకొచ్చారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్పై సీఎం ఫైర్
నిజమైన అయ్యప్ప భక్తులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పారు సీఎం. స్వార్థ ప్రయోజనాలకోసమే కొందరు ఆందోళనకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ ఆందోళనలతో రాజకీయ కుట్ర చేయాలని చూడటం సరికాదన్నారు. కేరళను రణరంగంలా మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 7 పోలీస్ వాహనాలతో పాటు 79 ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. పోలీస్ సిబ్బందిపై కూడా విరుచుకుపడినట్లు తెలిపారు. వారు దాడి చేసిన ఘటనలో ఎక్కువ శాతం మహిళలకే గాయాలయ్యాయని చెప్పుకొచ్చారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తమిళనాడుకు పాకిన సెగ
కేరళ ఆందోళనల సెగ తమిళనాడుకు తాకింది. చెన్నైలోని కేరళ టూరిజంకు చెందిన హోటల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో రాళ్లు రువ్వడంతో హోటల్ కు డ్యామేజీ జరిగింది. అయితే ఈ ఘటనపై కేరళ ప్రభావముందా లేదంటే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.