corona virus: రైళ్లలో వచ్చిన వారికి పరీక్షలు, రోగులతో మాట్లాడొద్దు, మీడియాతో పినరయి..
కరోనా వైరస్ కలవరానికి గురిచేస్తోంది. దేశంలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది కూడా దైవభూమి కేరళలోనే.. ముగ్గురికి పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కానీ వారికి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేయడంతో వైరస్ తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కానీ క్రమంగా మళ్లీ వైరస్ పుంజుకుంది. ఆదివారం మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. దీంతో కేరళ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
అలర్ట్.. అలర్ట్..
వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ కోరారు. వైరస్ క్రమంగా వ్యాపిస్తోందని.. ప్రపంచమంతా బాధితులు పెరిగిపోతున్నారని పేర్కొన్నారు. మనం మరింత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. శనివారం నాటి కేరళలో 7 వేల 677 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరిలో 7 వేల 375 మంది వారి ఇంట్లో చికిత్స తీసుకుంటుంగా.. 302 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సీఎం తెలిపారు. వీరిలో 106 మంది శనివారం ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు. 1897 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1345 మందికి నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యాక సీఎం పినరయి విజయన్ మీడియాతో మాట్లాడారు.
వాలంటీర్లకు శిక్షణ
వైరస్ స్ప్రెడ్ అవడంతో మరింత మంది నిర్మూలన కోసం పాల్గొనాలని కోరారు. ఇందుకోసం మరికొందరు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ అధికారులను కోరారు. ఇళ్లలో ఉన్న వారిని ప్రభుత్వ ప్రతినిధులు ప్రతీరోజు కలిసి... యోగక్షేమాలు తెలుసుకుంటారని చెప్పారు. విమానాశ్రయాల్లో మరింత పకడ్బందీగా స్కీనింగ్ చేస్తామని వివరించారు. ఆయా విమానాశ్రయాల పరిధిల్లో కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని.. దీంతో ప్రయాణికులకు మరిన్ని వైద్య పరీక్షలు చేసే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.
రైళ్లలో వచ్చిన కూడా..
ఇతర రాష్ట్రాలకు చెందినవారు రైళ్లలో కేరళలో దిగితే కూడా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. పారామెడికల్ సిబ్బంది, పోలీసు, మెడికల్ సిబ్బంది కలిసి ప్రయాణికులకు పరీక్షలు చేస్తారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కేరళ సరిహద్దలకు వచ్చేవారిని కూడా పరీక్షిస్తామని తేల్చిచెప్పారు. ప్రయాణికులను దింపివేసిన తర్వాత కేఎస్ఆర్టీసీ బస్సులను శుభ్రపరుస్తామని పేర్కొన్నారు.
Recommended Video
దూరం.. దూరం..
దీంతోపాటు ప్రజలకు వైరస్ గురించి అవగాహన కల్పించాలని మీడియాను సీఎం విజయన్ కోరారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన ఆస్పత్రుల్లో రిపోర్టింగ్ చేయొద్దని.. వైరస్ సోకిన రోగులతో మాట్లాడకపోవడమే మంచిదని సూచించారు. రోగులతో మాట్లాడితే తుప్పిళ్లు పడి.. వైరస్ సోకే అవకాశం ఉందని హెచ్చరించారు.