14 తరువాత లాక్డౌన్ ఎత్తివేత: హాట్స్పాట్లు, రెడ్జోన్లకు మాత్రమే పరిమితం: సీఎం తాజా వ్యూహం
తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ ముగింపు దశకు వచ్చింది. మరో రెండు రోజుల్లో దేశవ్యాప్త నిర్భం ముగియబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ను కొనసాగించడానికి ముందుకొస్తున్నాయి. తెలంగాణ, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ తరువాత కూడా లాక్డౌన్ను పొడిగించాయి. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగించబోతున్నాయి.
జగన్ సర్కార్ దిమ్మతిరిగే నిర్ణయం: బహిరంగ ప్రదేశాల్లో ఆ పని చేస్తే క్రిమినల్ కేసులు: ఉత్తర్వులు జారీ
లాభనష్టాల బేరీజు..
లాక్డౌన్ కొనసాగించడం వల్ల సంభవించే లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి మరి కొన్ని రాష్ట్రాలు. ఇప్పటికే 21 రోజుల పాటు విధించిన లాక్డౌన్ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని, పాక్షికంగా సడలించాల్సిన అవసరం ఉందని అంటూ ఏపీ, కేరళ సహా మరి కొన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించాయి.. మొన్నటి వీడియో కాన్ఫరెన్స్లో. నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది.
లాక్డౌన్ ఎత్తివేత దిశగా..
ఈ పరిస్థితుల్లో కేరళ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీ తరువాత తమ లాక్డౌన్ పొడిగించకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేరళ వ్యాప్తంగా చిరు వ్యాపారులు, కార్మికులు, దినసరి వేతన కూలీలు 21 రోజుల పాటు విధించిన లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి కూడా పెద్ద ఎత్తున గండి పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో..14వ తేదీ తరువాత లాక్డౌన్ను ఎత్తేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అక్వా రంగం కుదేల్..
కేరళకు ప్రధానంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, పర్యాటక రంగాల నుంచి ఆదాయం అందుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొనసాగిస్తోన్న విధ్వంసం వల్ల ఇప్పటికే పర్యాటక రంగం పూర్తిగా దిగజారిపోయింది. సాధారణ రోజుల్లో దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో సందడిగా కనిపించే ఈ గాడ్స్ ఓన్ కంట్రీ.. ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఇదే పరిస్థితి అక్వా రంగం కూడా ఎదుర్కొంటోంది. అక్వారంగం కుదేల్ కావడం వల్ల వచ్చే ఆదాయం కూడా అందట్లేదు.
రెడ్జోన్లు, హాట్స్పాట్లకు మాత్రమే పరిమితం
ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగించడం వల్ల మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన కేరళ ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన శనివారం నాటి వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానికి వివరించారని అంటున్నారు. కేరళలో కరోనా వైరస్ ప్రభావం కన్నూర్, కాసర్గోడ్, కోజికోడ్ వంటి జిల్లాలకు మాత్రమే పరిమితమైందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు గుర్తించిన రెడ్జోన్లు, హాట్స్పాట్లకు మాత్రమే లాక్డౌన్ను కొనసాగిస్తూ.. మిగిలిన ప్రాంతాల్లో పాక్షికంగా సడలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.