ముఖ్యమంత్రి కుమార్తె కులాంతర వివాహం: డీవైఎఫ్ఐ అధ్యక్షుడితో లవ్ మ్యారేజ్: దగ్గరుండి మరీ..
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా థయిక్కండియిళ్ కులాంతర వివాహం చేసుకున్నారు. సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడు పా మహ్మద్ రియాజ్ను ఆమె పెళ్లాడారు. సోమవారం ఉదయం కేరళ రాజధాని తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్లో అతికొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వివాహ మహోత్సవం పూర్తయింది.
ఐఎస్ఐ అన్నంత పనీ చేసిందా: వెంటాడి..రెక్కీ: పాక్లో ఇద్దరు భారత అధికారులు మిస్సింగ్: హైటెన్షన్
వీణా తండ్రి, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కొద్దిమంది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వీణ, మహ్మద్ రియాజ్ వివాహానికి సంబంధించిన రెండు ఫొటోలను కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. వీణా.. పినరయి విజయన్ పెద్ద కుమార్తె. ఔత్సాహిక పారిశ్రామికవేత్త. బెంగళూరులో ఆమె ఓ ఐటీ కంపెనీని నెలకొల్పారు. వందలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు.
సీపీఎంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న పీఎం అబ్దుల్ ఖాదర్, కేఎం అయీషా బీ దంపతుల కుమారుడు మహమ్మద్ రియాజ్. డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శిగా ఇదివరకు పని చేశారు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2017లో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. డీవైఎఫ్ఐ తరఫున తరచూ రాష్ట్రంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. టీవీ డిబేట్ల ద్వారా మలయాళీలకు చిరపరిచితుడు.
Recommended Video
సీపీఎం తరఫున క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతోన్న మహ్మద్ రియాజ్.. 2009 లోక్సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. యూడీఎఫ్ అభ్యర్థి ఎంకే రాఘవన్ చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గతంలో బీఫ్ కుకింగ్ ఉద్యమాన్ని నడిపించారాయన. గోమాంసాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన అనంతరం దానికి వ్యతిరేకంగా కేరళ వ్యాప్తంగా పలు ప్రదర్శనలను నిర్వహించారు. బీఫ్ కుకింగ్ ఆందోళనలను చేపట్టారు.