హైదరాబాద్ నుంచి వచ్చి..అర్ధరాత్రి అడవుల్లో చిక్కుకున్న 14 మంది అమ్మాయిలు: ముఖ్యమంత్రికి ఫోన్కాల్..!
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వస్థలాలకు చేరుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తోందనే విషయాన్ని రెండురోజులుగా చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరి.. తెలంగాణకు ఆనుకునే ఉన్న ఏపీకి చేరుకోవాలంటేనే గంటల కొద్దీ పడిగాపులు పడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు విద్యార్థులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు. అలాంటిది- ఇంటికెళ్లడానికి రెండు రాష్ట్రాలను దాటుకుని, వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఎదురైతే.. ఎలా ఉంటుందనే ఆలోచన కూడా భయం కలిగిస్తుంది.
భీకర కరోనా: అడ్డూ, అదుపు లేని వైరస్: భారత్లో ఒక్కరోజే వణుకు పుట్టించే రేంజ్లో పాజిటివ్ కేసులు
అర్ధరాత్రి పరుగులు పెట్టించిన సీఎం
అయినప్పటికీ.. ఈ సాహసానికి పూనుకున్నారు 14 మంది మలయాళీ అమ్మాయిలు. స్వస్థలానికి చేరుకోగలమనే నమ్మకంతో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. నిర్బంధ పరిస్థితుల్లో కూడా ఏపీ, కర్ణాటక మీదుగా సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సరిగ్గా తమ రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకు పోయిన ఆ అమ్మాయిలను అర్ధరాత్రి ఆదుకున్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తరువాత ఆ అమ్మాయిలు చేసిన ఫోన్ కాల్కు స్పందించారు. వారిని సరిహద్దులు దాటించడానికి అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.
హైదరాబాద్ టు కోజికోడ్..
లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. హైదరాబాద్లో ప్రైవేటు హాస్టళ్లు మూతపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేస్తోన్న మలయాళీలు స్వస్థలానికి తిరుగుముఖం పట్టారు. దీనికోసం వారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి పత్రాలను పొందారు. వారంతా కేరళలోని కోజికోడ్కు చేరుకోవాల్సి ఉంది. దీనికోసం ఓ ప్రైవేటు వాహనాన్ని అద్దెకు కుదుర్చుకున్నారు. బుధవారం రాత్రి వారు కేరళకు బయలుదేరి వెళ్లారు. ఏపీ, కర్ణాటక మీదుగా కోజికోడ్కు చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలో పోలీసుల ఆంక్షలును అధిగమించి గురువారం రాత్రి కర్ణాటక-కేరళ సరిహద్దులను చేరుకున్నారు.
రెండు ఫోన్కాల్స్ రింగ్స్కే సీఎం స్పందన..
కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల తరహాలోనే కేరళ సరిహద్దులను మూసివేసింది. దీనితో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని ముత్తంగ చెక్పోస్ట్ వద్ద వారు స్తంభించిపోయారు. చెక్పోస్ట్ సిబ్బందికి బతిమాలుకున్నప్పటికీ.. కేరళలో ప్రవేశించడానికి అక్కడి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనితో వారు ఏకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఫోన్ చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 గంటలకు వారు పినరయికి ఫోన్ చేయగా.. రెండే రెండు ఫోన్ కాల్ రింగులకు ఆయన తన మొబైల్ ఫోన్ను లిఫ్ట్ చేశారు. ఆ మలయాళీ అమ్మాయిలతో మాట్లాడారు.
వైద్య పరీక్షలను నిర్వహించిన తరువాతే..
వారి సమస్యను తెలుసుకున్న వెంటనే.. వాయనాడ్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా వారిని సరిహద్దులను దాటించాలని సూచించారు. పినరయి విజయన్కు ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే తిరునెల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఏయూ జయప్రకాశ్ ముత్తంగ చెక్పోస్ట్కు చేరుకున్నారు. అక్కడ వైద్య కరోనా వైద్య పరీక్షలను నిర్వహించడానికి సరైన వసతి లేకపోవడంతో.. మరో సరిహద్దు చెక్పోస్ట్ థోల్పెట్టైకి వెళ్లారు. అక్కడ ఆ 14 మంది యువతులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. వారందరూ ఆరోగ్యంగా ఉండటంతో కోజికోడ్కు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.
క్వారంటైన్లో మరోసారి..
అనంతరం క్వారంటైన్లో మరోసారి పరీక్షలను నిర్వహించడానికి వారు అంగీకరించారు. ఆ 14 అమ్మాయిల్లో ఒకరైన అత్తిర అనే టీసీఎస్ ఉద్యోగిని ఈ సంఘటనలన్నింటినీ తన ఫేస్బుక్ ఖాతాలో పొందుపరిచారు. సరైన సమయంలో ముఖ్యమంత్రి తమను ఆదుకున్నారని, ఆయనకు కృతజ్ఙతలు తెలుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. క్వారంటైన్లో మరోసారి వైద్య పరీక్షలను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె వెల్లడించారు.