కరుణానిధికి కేరళ సీఎం, హీరో అజిత్ కుమార్ పరామర్శ: అఖిలేష్ ఫోన్
చెన్నై: కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, ఎంపీ కనిమొళిలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయన్ విలేకరులతో మాట్లాడారు.
కరుణ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని స్టాలిన్, కనిమొళిలు చెప్పారని తెలిపారు. కరుణానిధి పుట్టుకతోనే పోరాటయోధుడని, తన రాజకీయ జీవితంలో ఎన్నో విషయాలపై పోరాడారని కితాబిచ్చారు. ఆయన సంకల్ప శక్తి చాలా గొప్పదన్నారు. కరుణ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎల్డీ అధ్యక్షులు అజిత్ సింగ్ కూడా అంతకుముందు పరామర్శించారు.
ప్రముఖ సినీ నటుడు అజిత్ కూడా గురువారం కరుణానిధిని పరామర్శించారు. ఆయన కావేరీ ఆసుపత్రికి చేరుకొని స్టాలిన్ తదితరులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్టాలిన్కు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు. తన తండ్రి కరుణానిధి స్పృహలోనే ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు ఆళగిరి చెప్పారు.
కాగా, కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నై కావేరి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందుతోందన్నారు. గత నెల 27వ తేదీన కరుణను ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. గత శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరుణానిధి రక్తపోటు పడిపోవడంతో ఆయనను హుటాహుటిన నగరంలోని కావేరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలోనే ఉన్నారు.