బడి పంతుళ్ల అవతారమెత్తనున్న సీఎం, మంత్రులు..
కేరళ : దేశంలో.. ఏ రాష్ట్ర కేబినెట్ ఇంతవరకు బహుశా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదేమో..! కేరళ కేబినెట్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయమేంటంటే.. వచ్చే గురు పూజోత్సవం నాడు.. సీఎంతో సహా అక్కడి మంత్రులంతా అట్టాక్కులంగరలోని ప్రభుత్వ పాఠశాలలో పంతుళ్ల అవతారమెత్తబోతున్నారు.
సీఎం పినరాయి విజయన్ తో పాటు ఆయా శాఖల మంత్రులు సెప్టెంబర్ 5న అక్కడి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పాఠాలు బోధించబోతున్నారు. రోజువారీ జీవితంలో అవలంభించవలసిన కొన్ని మంచి పద్దతుల గురించి విద్యార్థులకు మంత్రులు తర్ఫీదునివ్వనున్నారు. విశేషమేంటంటే.. సదరు మంత్రుల్లో చాలామంది గతంలో టీచర్లుగానే పనిచేశారట.
డ్రగ్స్, ఆల్కాహాల్, బద్దకం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం లాంటి అనేకాంశాల మీద విద్యార్థులకు అక్కడి మంత్రుల బృందమంతా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు గురువారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమ ఆసక్తి మేరకు స్థానిక పాఠశాలల్లో ఒక్కరోజు టీచర్ గా పనిచేయాలని సూచిస్తోంది కేరళ సర్కార్.