కేరళ తీర ప్రాంతాల్లో కరోనా సమూహ వ్యాప్తి: మళ్లీ కఠిన లాక్డౌన్
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం కోస్తా ప్రాంతాల్లో కరోనావైరస్ సమూహ వ్యాప్తికి చేరుకుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లోనే 800 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 11 వేలకు చేరింది. దీంతో కోస్తా ప్రాంతంలో కరోనా సమూహ వ్యాప్తికి చేరుకుందని నిర్ధారించింది.
Recommended Video
రాజధాని జిల్లాలోని పుల్లువిల, పూంతుర కోస్తా ప్రాంతాల్లో కరోనా వైరస్ సమూహ వ్యాప్తికి చేరుకుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం తెలిపారు. తిరువనంతపురం కోస్తా ప్రాంతాల్లో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు ఆయన చెప్పారు.
ఈ ప్రాంతాలను మూడు జోన్లుగా విభజిస్తామన్నారు. మొదటిది అంచుతేంగు- పెరుమతుర, రెండోది పెరమతుర-విజింజమ్, మూడోది విజింజమ్-ఉరంబు. కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు విధించి ప్రత్యేక పోలీసు పర్యవేక్షణ ఉంచుతామని తెలిపారు.
కోస్తా ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేల్చారు. కోస్తా ప్రాంతాల్లో కరోనా కట్టడికి స్పెషల్ మెకానిజం రూపొందించేందుకు తిరువనంతపురం పోలీస్ కమిషనర్ బలరాం కుమార్ ఉపాధ్యాయ్కు బాధ్యతలు అప్పగించారు.
సహాయం కోసం ఓ కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మూడు జోన్ల పర్యవేక్షణ కోసం ఇద్దరేసి ఐఏఎస్ అధికారులను నియమించనున్నారు. కోస్లా ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రజలు కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటికి వచ్చేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలకు నిత్యావసరాల వస్తువులు ప్రభుత్వ అధికారులు అందిస్తారని సీఎం చెప్పారు. కరోనా కట్టడి కోసం సేవలందిస్తున్న ప్రభుత్వ సిబ్బంది పట్ల ప్రజలు మర్యాదగా నడుచుకోవాలన్నారు. వారిని అవమానించే విధంగా ప్రవర్తించకూడదని స్పష్టం చేశారు.