కేరళ మంత్రి ‘కోవిడ్ రాణి’ అట, కాంగ్రెస్ చీఫ్ నోటిదురుసు, సోషల్ మీడియాలో ట్రోల్.. అలా కాదు...
కేరళ వైద్యారోగ్యశాఖ మంత్రి కేకే శైలజాపై పీసీసీ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ నోటిదురుసు ప్రదర్శించారు. ఆమెను కోవిడ్ రాణి అంటూ ఎగతాళి వేశారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో.. రామచంద్రన్ దిగొచ్చారు. తాను స్త్రీలను గౌరవస్తానని చెప్పి.. కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఇతర దేశాల నుంచి కేరళకు రావాలనుకొంటున్న ప్రవాసులకు కరోనా రహిత ధృవీకరణ పత్రం కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకడుగు ముందుకేసిన రామచంద్రన్.. ప్రవాసుల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ఆరోగ్య మంత్రి కేకే శైలాజా కోవిడ్ రాణి అని ఎగతాళి చేశారు. ఆమె ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆసక్తి చూపడం లేదని.. ఆమెకు రికార్డులు, పురస్కారాల మీద ఉన్న ప్రేమ జనాల ఆరోగ్యం గురించి లేదని విమర్శించారు. కేరళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలిపిన నిరసనలో కామెంట్లు చేశారు.
ఆరోగ్య మంత్రి కేకే శైలాజా ఇదివరకు 'నిపా రాజకుమారి' టైటిల్ పొందారు.. ఇప్పుడు 'కోవిడ్ రాణి' బిరుదు కోసం ప్రయత్నిస్తున్నారు అని కామెంట్ చేశారు. మూడు నెలల్లో కరోనా వైరస్ వల్ల గల్ఫ్లో 200 మంది వరకు ప్రవాసులు చనిపోయారని... దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని రామచంద్రన్ డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉన్న ప్రజలు తిరిగి రావాలని కోరుకుంటున్నారని.. ప్రభుత్వం మాత్రం కరోనా కేసుల సంఖ్య గురించి భయపడుతోందని చెప్పారు.
Recommended Video
కేరళ అభివృద్ధి కోసం పాటుపడ్డ ప్రవాసులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కానీ వారి గురించి మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. రామచంద్రన్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడయాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. స్త్రీలను అవమానించలేదని.. విధులు సరిగ్గా నిర్వహించని మంత్రిని మాత్రమే విమర్శించానని తెలిపారు.