మనసుంటే..: రైల్వే వైఫై సాయంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కూలీ!
తిరువనంతపురం: మనసుంటే మార్గముంటుందని పెద్దలు అంటూ ఉంటారు. ఈ వ్యాఖ్యలను నిజం చేశాడు ఓ రైల్వే కూలీ. ఓ వైపు తన విధులు నిర్వహిస్తూనే రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వైఫై సౌకర్యాన్ని తన చదువుకు ఉపయోగించుకుని ఏకంగా కేరళ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాడు.
ప్రభుత్వ సాధించాలి..
ఆ వివరాల్లోకి వెళితే.. మున్నుర్కు చెందిన కే శ్రీనాథ్ అనే యువకుడు ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫైను ఉపయోగించుకుని ఎలాగైనా ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని బలంగా అనుకున్నాడు.
పరీక్షలకు సిద్ధమిలా..
ఆ మరుక్షణం నుంచే తన కార్యాచరణను అమల్లోకి తీసుకొచ్చాడు. వెంటనే ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. రైల్వే స్టేషన్లోని ఫ్రీ వైఫై సాయంతో ఇంటర్నెట్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి న మెటీరియల్ను కలెక్ట్ చేశాడు. కొన్ని ఆడియోలను, వీడియోలను సేకరించాడు.
విధులు నిర్వహిస్తూనే..
ఓ వైపు కూలీ పనిచేస్తూనే.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని, దాని ద్వారా ఆడియోలను వినేవాడు. ఖాళీ సమయాల్లో మెటీరియల్ను చదువుకునేవాడు. రాత్రి వేళల్లో రివిజన్ కూడా చేసుకునేవాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలనే లక్ష్యంతో అహర్నిశలు కష్టపడి చదివాడు.
పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో అర్హత సాధించాడు..
ఫలితంగా ఇటీవలే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హత సాధించాడు శ్రీనాథ్. ఇప్పుడు ఇంటర్వ్యూలో నెగ్గితే ఇక ప్రభుత్వ కొలువు సంపాదించాలన్న అతని కల నెరవేరినట్లే. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలో అర్హత సాధించిన శ్రీనాథ్ను పలువురు అభినందించారు. కాగా, రైల్వే ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఉద్దేశంతో 2016లో డిజిటల్ ఇండియాలో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 685 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే.