అతనికి 25, ఆమెకు 48: ఒంటిపై భారీ ఆస్తి..అందుకేనా పెళ్లి?
కన్నూర్: పెళ్లి అనేది ఎవరికైనా ఓ తియ్యటి కల. దాన్ని చిరస్మరణీయంగా ఉంచుకోవడానికి నూతన దంపతులు తమవంతు ప్రయత్నాలు చేస్తారు. తామిద్దరం దిగిన ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు వేయించడం, దినపత్రికల్లో యాడ్స్ ఇవ్వడం సహజం. కేరళకు చెందిన కొత్త దంపతులు చేసిన ఈ ప్రయత్నం వారికి పీడకలగా మారింది. వారు కలిసి దిగిన ఫొటోలపై గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరంగా వ్యాఖ్యానాలు చేశారు. ఆ దంపతుల ఫొటోకు ఘాటుగా క్యాప్షన్లను జోడించి, వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. అటు తిరిగి, ఇటు తిరిగి ఆ ఫొటోలు నవదంపతులకు వాట్సప్ అయ్యాయి. దీన్ని చూసిన వారు బిత్తరపోయారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాడీ షేమింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత దంపతుల పేర్లు అనూప్ పీ సెబాస్టియన్ (29), జుబీ జోసెఫ్ (27). కన్నూర్ జిల్లాలోని చెరుప్పుళకు చెందిన అనూప్, అదే జిల్లాలోని చెంబన్ థొట్టై గ్రామానికి చెందిన జుబీ జోసెఫ్ స్నేహితులు. ఒకే కళాశాలలో కలిసి చదువుకున్నారు. వృత్తిరీత్యా అనూప్ చండీగఢ్ లో, జుబీ షార్జాలో పనిచేస్తున్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జుబీ జోసెఫ్ కాస్త లావుగా ఉంటుంది. చూడ్డానికి అనూప్ కంటే వయస్సు ఎక్కువగా కనిపిస్తుంది. ముందుగా నిర్ధారించిన తేదీ ప్రకారం.. శనివారం వారి పెళ్లి స్థానిక చర్చిలో జరగాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల దాన్ని ప్రీపోన్ చేశారు. ఈ నెల 4వ తేదీ నాడే వారి పెళ్లి జరిగిపోయింది.
పెళ్లి సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రులు.. స్థానిక మలయాళ దినపత్రికలో ఓ అడ్వర్టయిజ్ మెంట్ ఇచ్చారు. అనూప్, జుబీతో కలిసి తాము దిగిన గ్రూప్ ఫొటోను అందులో ప్రచురించారు. అసలు సమస్యకు అదే కారణమైంది. అనూప్-జుబీల జోడీని కించపరుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. జుబీ జోసెఫ్ వయస్సు 27 సంవత్సరాలే అయినప్పటికీ.. శరీర తత్వం కారణంగా ఆమె లావుగా, బొద్దుగా కనిపిస్తుంది. దీన్ని కేంద్రబిందువుగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఘాటుగా కామెంట్స్ చేశారు.
అతనికి 25, ఆమెకు 48. ఆస్తిపై కన్నేసి ఆమెను పెళ్లి చేసుకున్నారు. పెళ్లికుమార్తె ఒంటిపై భారీగా నగలు ఉన్నాయి. ఇక ఇంట్లో ఎన్ని నగలు ఉంటాయో?. వధువు ఆస్తి కనీసం 25 కోట్ల రూపాయలు ఉంటుంది. కట్నంగా 50 లక్షల రూపాయలను తీసుకున్నారు. ఈ పెళ్లి మన చెరుప్పుళలోనే ఏర్పాటైంది.. అంటూ ఇలా కామెంట్లు చేశారు. అనూప్, జుబీ జోసెఫ్ ల ఫొటోలకు తమ కామెంట్లను జోడించి వాట్సప్ గ్రూపుల్లో వదిలారు. అవి పెద్ద ఎత్తున ఫార్వర్డ్ అయ్యాయి. ఎంతలా వైరల్ అయ్యాయంటే..షార్జాలో ఉన్న అనూప్ స్నేహితులు కూడా దీనికి స్పందించారు. ఆస్తి కోసం 48 సంవత్సరాల మహిళను ఆమెను పెళ్లి చేసుకున్నావా? అంటూ ఫోన్లు చేశారు.
ఇలా పలువురు వ్యక్తులు ఫోన్లు చేసి, ఆరా తీశారు. దీనితో మానసిక ఆవేదనకు గురైన వారిద్దరూ.. శ్రీకండపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ నియంత్రణ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాట్సప్ గ్రూప్ ల వారీగా అసలు నిందితులను అన్వేషిస్తున్నారు. రేపో, మాపో వారిని అరెస్టు చేస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కన్నూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు.