బీడీ ‘కింగ్’ దోషి అని తేల్చిన కేరళ కోర్టు
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన త్రిశూర్ హమ్మర్ కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త మహమ్మద్ నిషామ్ ను కోర్టు దోషిగా తేల్చింది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారకుడు అయ్యాడని న్యాయస్థానం నిర్ధారించింది.
నిందితుడికి త్వరలో జైలు శిక్ష ఖరారు చేస్తామని బుధవారం న్యాయస్థానం చెప్పింది. దేశ, విదేశాలకు బీడీలు సరఫరా చేస్తూ బీడీ కింగ్ గా ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామిక వేత్త మహమ్మద్ నిషామ్ జైలు పాలైనాడని కేరళ పోలీసులు తెలిపారు.
2014వ సంవత్సరంలో త్రిశూర్ లో మహమ్మద్ నిషామ్ తన హమ్మర్ కారును నిర్లక్షంగా నడిపాడు. కారు అదుపుతప్పి సెక్యూరిటీ గార్డు చంద్రబోస్ ను డీకొట్టాడు. తరువాత మహమ్మద్ నిషామ్ అక్కడి నుంచి పరారైనాడు.
తీవ్రగాయాలైన సెక్యూరిటీ గార్డు చంద్రబోస్ మూడు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి మరణించాడు. ప్రమాదం జరిగిన తరువాత మహమ్మద్ నిషామ్ బెంగళూరు చేరుకున్నాడు.
తరువాత స్టార్ హోటల్ లో బస చేసి కేరళ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. గత సంవత్సరం ఒక రోజు అర్దరాత్రి దాటిన తరువాత మద్యం సేవించిన మహమ్మద్ నిషామ్ హోటల్ నుంచి తన హమ్మర్ కారును బయటకు తీసుకు వచ్చాడు.
ఎంజీ రోడ్డు నుంచి కారును వేగంగా నడుపుతూ హంగామా చేశాడు. గస్తీ తిరుగుతున్న పోలీసులు కారును నిలిపి మహమ్మద్ నిషాన్ ను ప్రశ్నించారు. ఆ సందర్బంలో మద్యం మత్తులో ఉన్న నిషామ్ కబ్బన్ పార్క్ పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు.
పోలీసులు అతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అధికారులు విచారించగా కేరళలో కారు ప్రమాదం సృష్టించి బెంగళూరు వచ్చాడని తెలుసుకున్నారు. తరువాత కేరళ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి పోలీసులు బెంగళూరు వచ్చి మహమ్మద్ నిషామ్ ను అరెస్టు చేశారు.
కేరళ జైలులో రిమాండ్ లో ఉన్న మహమ్మద్ నిషామ్ గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి పోలీసులు ప్రయత్నించారు. అతడిని స్టార్ హోటల్ లో భోజనం చెయ్యడానికి అనుమతి ఇవ్వడంతో ఐదు మంది పోలీసులను సస్పెండ్ చేశారు.