కరోనా విలయం- కేరళ కకావికలం -భారీగా మరణాలు, కొత్తగా 22,040 కేసులు, 13.49శాతానికి టీపీఆర్
దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతున్నది. గడిచిన పది రోజులుగా 22వేల పైచిలుకు కొత్త కేసులు వస్తుండటంతోపాటు మరణాల సంఖ్యా భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతూ 13.49 శాతానికి చేరింది. కేరళలో పరిస్థితిపై కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నది..
కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34.93 లక్షలకు పెరిగింది. నిన్న ఒక్కరోజే 117 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 17,328కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1, 77, 924గా ఉంది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13.49 శాతానికి చేరింది.
నిజానికి కరోనా మహమ్మారిని మొదటి దశలో సమర్థవంతంగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కేరళ.. రెండో దశలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. దేశంలో ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా నిత్యం వార్తాల్లో నిలిచింది. అయితే చేజేతులా విజయన్ ప్రభుత్వమే ఈ దుస్థితిని కొని తెచ్చుకుంటోందని తాజాగా కేంద్ర బృందం తేల్చింది. కేరళలో కరోనా ఉధృతికి గల కారణాలను విశ్లేషించేందుకు వెళ్లిన కేంద్ర బృందం ఆందోళనకర విషయాలను బయటపెట్టింది.
తాజా కరోనా కొత్త కేసులతోపాటు ఆర్ వాల్యూ కొన్ని రాష్ట్రాల్లో పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. కానీ ప్రజలు ఆందోళనకు గురి కావద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. శరవేగంగా వైరస్ వ్యాప్తికి ఆర్ విలువ కీలకంగా మారింది. సగటున వైరస్ బారిన పడ్డవారి నుంచి ఎంత మందికి వ్యాపించిందని తెలియజేసేదే ఆర్ విలువ. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నదని ఇప్పటికిప్పుడు ప్రకటించడం తొందరపాటవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దేశంలో సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని వ్యాఖ్యానించారు.
కేరళలో ప్రస్తుతం కరోనా తీవత్రకు ప్రధాన కారణం కాంటాక్ట్-ట్రేసింగ్ లో వైఫ్యలమేనని కేంద్ర బృందం తేల్చింది. ఇళ్లల్లో ఐసోలేషన్ ఉంటున్న రోగులను ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షించడం లేదని తెలిపింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఎవరైనా కరోనా బారిన పడితే.. 20 కాంటాక్ట్లను గుర్తించాలని కేంద్రం సూచించింది. కానీ కేరళలో కరోనా విజృంభిస్తున్నా.. ఒక్క రోగికి సంబంధించిన కనీసం అతడితో కాంటాక్ట్ ఉన్న ఇద్దరి వ్యక్తులను కూడా గుర్తించడం లేదని కేంద్ర బృందం తమ నివేదికలో అభిప్రాయపడింది. మరోవైపు కేరళలో ప్రతి కరోనా మరణాన్ని లెక్కిస్తున్నప్పటికీ.. కొన్ని కేసుల్లో చనిపోయిన తర్వతే కరోనా ఉందని గుర్తిస్తున్నారని తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కి లేఖ రాశారు.
కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా పెంచాలని కేరళకు కేంద్రం సూచించింది. లేదంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి మరింత పెరుగుతుందని హెచ్చరించారు. అలాగే అధిక పాజిటివిటీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలనీ పేర్కొన్నారు. ఒక ఇంటిలో ఎవరైనా కరోనా బారిన పడితే.. మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది కూడా పట్టించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 14 రోజుల హోం ఐసోలేసన్, క్వారంటైన్ నియమాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఓనం పండగ సందర్భంగా గత ఏడాది రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరిగినందు.. ఈ ఏడాది అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సూచించారు.
అయినాసరే, కేరళలో ప్రస్తుతం నిత్యం 20 వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే శనివారం,ఆదివారం రెండు రోజులు లాక్ డౌన్ విధించింది కేరళ ప్రభుత్వం. అయితే కొన్ని సడలింపులిచ్చింది. ప్రస్తుతం శనివారం లాక్ డౌన్ ఎత్తివేసి కేవలం ఆదివారం మాత్రం సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పదని హెచ్చరించింది.ఇదిలా ఉంటే,
కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం నాటి లెక్కల ప్రకారం దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 42,982 కరోనా కేసులు నమోదవ్వగా.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,18,12,114కి చేరిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4,11,076 ఉన్నాయి. కరోనాతో బుధవారం ఒక్క రోజే 533 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,26,290కి చేరింది. ఇక దేశంలో రికవరీ రేటు 97.37గా ఉంది. రాష్ట్రాల వారీగా మరణాల సంఖ్యను చూస్తే.. మహారాష్ట్ర 1,33,410, కర్ణాటక 36,680, తమిళనాడు 34,197, ఢిల్లీ 25,058, ఉత్తరప్రదేశ్ 22,767, పశ్చిమబెంగాల్ 18,180, కేరళ 17,211 కరోనా మరణాలు సంభవించాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కాగా,
Recommended Video
ప్రపంచవ్యాప్తంగానూ కొవిడ్ ఉధృతి తగ్గలేదు. గురువారం నాటికి గ్లోబల్ గా మొత్తం కేసుల సంఖ్య 20 కోట్లు దాటేసింది. మొత్తంగా 20,12,26,769 కేసులు నమోదుకాగా, మొత్తం మరణాల సంఖ్య 42,74,737కు పెరిగాయి. కేసుల పరంగా అమెరికా 3.6 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, భారత్ 3.1కోట్ల కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళ తరహాలో మిగతా రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగితే గనుక భారత్ కేసుల పరంగా అమెరికాను దాటేసే రోజు ఎంతో దూరంలో లేదు..