కేంద్ర మంత్రి మేనకా గాంధీ వెబ్ సైట్ హ్యాక్
కొచ్చి: కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వెబ్ సైట్ హ్యాక్ చేశారు. జంతు సంరక్షణ కోసం మేనకా గాంధీ అధికారికంగా నడుపుతున్న పీపుల్ ఫర్ యానిమల్స్ అనే వెబ్ సైట్ హ్యాక్ చేశారు.
కేరళ సైబర్ వారియర్స్ హ్యాక్ చేశారని వెలుగు చూసింది. ఇటీవల కేరళకు చెందిన ఓ వృద్దురాలిని వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. దాంతో మేనకా గాంధీ వెబ్ సైట్ లోని కొన్ని పేజీలను హ్యాక్ చేశారు.
ఆ పేజీల మీద క్లిక్ చేస్తే భారత్ ను వీధి కుక్కల రహిత దేశంగా చేయ్యాలి అంటూ తమ లోగో వచ్చేలా మార్చేశారు. కేరళలో వీధికుక్కలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వాటిని నిర్మూలించాలంటే కచ్చితంగా వీధి కుక్కలను చంపేయాలని గతేడాదే కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే జంతు ప్రేమికులు కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించి ఆందోళనలు చేసి ఆ నిర్ణయాన్ని రద్దు చేయించారు. ఇప్పుడు అదే వీధి కుక్కలకు సామాన్య ప్రజలు బలైపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
జంతువులకు ఉండే హక్కులు మనషులకు లేవా అని వారు ప్రశ్నిస్తున్నారు. కేరళ ప్రభుత్వం వీధి కుక్కలను నిర్మూలించాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఆందోళనలు చేసిన జంతు ప్రేమికులు ఇప్పుడు మనుషుల విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశిస్తున్నారు.
కేరళలో వీధి కుక్కల సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూపించడానికి మేనకా గాంధీ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. మేనకా గాంధీ వెబ్ సైట్ హ్యాక్ చేసిన వారి కోసం సైబర్ పోలీసులు గాలిస్తున్నారు.