సంపూర్ణ ప్రాథమిక విద్య: తొలి రాష్ట్రంగా కేరళ
తిరువనంతపురం: అక్షరాస్యతలో కేరళ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో ‘సంపూర్ణ ప్రాథమిక విద్య'ను సాధించిన తొలి రాష్ట్రంగా అవతరించింది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు.
ఇది చరిత్రాత్మక విజయమని ఆయన అభివర్ణించారు. ‘కేరళ 1991లో ఏప్రిల్ 18న సంపూర్ణ అక్షరాస్యతను సాధించినట్టు ప్రకటించింది. కేరళకు ఆరోజు మాదిరిగానే ఈరోజూ చరిత్రాత్మకమైంది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది' అని అన్సారీ కొనియాడారు.
సంపూర్ణ ప్రాథమిక విద్యను సాధించే లక్ష్యంతో కేరళ ‘అతుల్యమ్' కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 15-50 మధ్య వయసు వారందరికీ నాలుగో తరగతితో సమానమైన విద్యను అందించాలని సంకల్పించింది. దీన్ని కేరళ విజయవంతంగా పూర్తి చేసిందని, ఇది కేరళ విద్యా కిరీటంలో కలికితురాయిగా నిలుస్తుందని అన్సారీ పేర్కొన్నారు.
ఎంతో ప్రణాళికా బద్ధంగా చేసిన అనేక కార్యక్రమాలు కేరళను సంపూర్ణ ప్రాథమిక విద్య అందించిన రాష్ట్రంగా నిలిపాయని అన్నారు. ఈ సందర్భంగా కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీని హమీద్ అన్సారీ అభినందించారు.