20 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - కేరళ అల్లకల్లోలం : తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభావం..!!
రానున్న మూడు రోజులు దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య, ద్వీపకల్పంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వాతావరణశాఖ బులెటిన్లో పేర్కొంది. అక్టోబరు 18 నుంచి 20తేదీల మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
కేరళ అతలా కుతలం
ఇప్పటికే కేరళలో భారీ వర్షాలు అతలా కుతలం చేసాయి. వరదల నేపథ్యంలో ఇడుక్కి , త్రిసూర్ సహా ఐదు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది. కేరళ లో వరదల ప్రభావంపై సీఎం పినారయి విజయన్ తో చర్చించిన ప్రధాని మోదీ.. కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కేరళ వరదలకు 26 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రధాని హామీ..సహాయక చర్యల్లో ఆర్మీ
కొట్టాయంలో సహాయకచర్యలు చేప్పట్టిన ఆర్మీ అధికారులు, హెలికాప్టర్ సహాయం తో వరద బాధితులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. కేరళలోని కొట్టాయంలో కురిసిన భారీ వర్షాలకు వరదలో కొట్టుకుపోయిన ఇల్లు , నీట మునిగిన పలు గ్రామాలు.. సహాయక చర్యలను వేగవంతం చేయాలనీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇక, ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు సమీప రాష్ట్రాల్లోని గురుగ్రామ్, గోహానా, మనెసర్, గన్నౌర్, ఔరంగాబాద్, పల్వాల్, ఫరీదాబాద్, బల్లభ్గర్, పానిపట్, సొహానా, నోయిడా, ఘజియాబాద్, నార్నుల్, కర్నాల్, గ్రేటర్ నోయిడా, ముజఫర్నగర్, హస్తినాపూర్, మీరట్తోపాటు పలు ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల్లో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది.
ఢిల్లీలోనూ భారీ వర్షాలు
ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావం దక్షిణ తూర్పు ద్వీపకల్పంపై చూపిస్తుందని, దీనివల్ల కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ వివరించింది.కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
20 రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరికలు
బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తున్నందున తూర్పు భారతదేశంలో అక్టోబర్ 20 వరకు భారీ వర్షపాతం కొనసాగుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, సిక్కింలలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. అక్టోబరు 18 నుంచి 20తేదీల మధ్య పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశాలలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు.
Recommended Video
తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం
ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ పైన అల్పపీడనం ఆవరించింది. ఈ ప్రభావంతో ఈ రోజు, మంగళవారం అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక, ఇప్పటి సాగర్ క్రస్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు ఫ్లో తగ్గటంతో నీటిని నిలిపివేసారు.