బాత్రూమ్ గోడలపై 'సారీ'... యువ వైద్యుడి ఆత్మహత్య... ఆ సర్జరీనే కారణమా...?
కేరళలో ఓ యువ వైద్యుడి ఆత్మహత్య తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల తాను సర్జరీ చేసిన ఓ చిన్నారి మృతి చెందడంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సోషల్ మీడియా వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగింది...
కొల్లాం జిల్లాలోని కిలికొల్లూరులో అనూప్ కృష్ణ అనే ఆర్ఢోపెడిక్ వైద్యుడు సొంతంగా ఆర్థో కేర్ ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 23న అనూప్ ఓ ఏడేళ్ల చిన్నారికి తన ఆస్పత్రిలోనే మోకాలి సర్జరీ చేశారు. అయితే సర్జరీ సమయంలో చిన్నారికి గుండెపోటు రావడంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు అనూప్ ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. చిన్నారి మృతికి డా.అనూపే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
బాత్రూమ్ గోడలపై 'సారీ..'
డా.అనూప్పై కొల్లాం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అనూప్ గురువారం(అక్టోబర్ 1) తన ఆస్పత్రిలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు బాత్రూమ్లోని గోడలపై 'సారీ' అన్న పదం రాసినట్లు తెలుస్తోంది. బాలిక మృతి నేపథ్యంలో అనూప్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన మరణంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి.
అనూప్కు మద్దతుగా కేరళ వైద్యులు
అనూప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ... పోలీసులు మాత్రం ఇప్పుడే ఏమీ నిర్దారించలేమన్నారు. చిన్నారి మృతి ఘటనకు సంబంధించి ఏవైనా బెదిరింపులు ఎదురైతే తమతో చెప్పాలని అనూప్కు చెప్తూనే ఉన్నామన్నారు. కానీ ఆయన వైపు నుంచి అలాంటి ఫిర్యాదులేవీ అందలేదన్నారు.మరోవైపు కేరళ వైద్యులు అనూప్కు మద్దతుగా నిలుస్తున్నారు. నిజానికి చాలామంది వైద్యులు ఆ చిన్నారికి వైద్యం చేసేందుకు నిరాకరించారని... కానీ అనూప్ మాత్రం కోవిడ్ 19 రిస్క్ని కూడా పట్టించుకోకుండా చిన్నారికి వైద్యం చేశాడని ఓ కేరళలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ఉపాధ్యక్షుడు సుల్ఫీ నూహు వెల్లడించారు.
Recommended Video
నిర్లక్ష్యానికి.. సంక్లిష్టతకు తేడా...
దురదృష్టవశాత్తు చిన్నారి చనిపోయిందని.. దీంతో అనూపే చిన్నారిని చంపేశాడని కొంతమంది సోషల్ మీడియాలో అనూప్పై తీర్పులిచ్చేశారని.... తమ వ్యూస్ కోసం యూట్యూబ్లో నెగటివ్ వీడియోలు వదిలారని నూహు ఆరోపించారు. ఫలితంగా కేరళ ఒక గొప్ప వైద్యుడిని కోల్పోయిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరో వైద్యుడు డా.జినేష్ మాట్లాడుతూ... నిర్లక్ష్యానికి,సంక్లిష్టతలకు తేడా ఉంటుందన్నారు. ప్రతీ సర్జరీలోనూ కొన్ని సమస్యలు ఉంటాయని... ముఖ్యంగా అనస్థీషియా ఇచ్చే సర్జరీల్లో సంక్లిష్టతలు తలెత్తుతాయని చెప్పారు. అలాంటి సమస్య రాకుండా జాగ్రత్తపడుతామని... కానీ కొన్నిసార్లు ఆ సంక్లిష్టతలు తీవ్రమైతే మరణం సంభవిస్తుందన్నారు. అయితే జరిగింది నిర్లక్ష్యమా లేక సర్జరీలో తలెత్తిన సంక్లిష్టతనా అన్నది తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు.