కేరళలో ఏనుగు హత్య: మేనకా గాంధీపై కేసు నమోదు
తిరువనంతపురం/లక్నో: కేరళలో జరిగిన ఏనుగు దారుణ హత్య విషయంలో బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమెపై కేసు నమోదుకు దారితీశాయి. మలప్పురం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది.
ఏనుగు కేసులో ముగ్గురు అరెస్ట్: న్యాయం జరుగుతుందన్న సీఎం, ఫారెస్ట్ అధికారి వాదన మరోలా
మల్లపురం జిల్లా ప్రజలను కించపరిచే విధంగా మేనకా గాంధీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆ జిల్లాకు చెందిన సుభాష్ చంద్రన్ అనే న్యాయవాది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనకా గాంధీతోపాటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులుపెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు మరో ఏడు ఫిర్యాదులు కూడా స్వీకరించామని పోలీసులు తెలిపారు.
పైనాపిల్లో బాంబు పెట్టి గర్బిణీ అయిన ఏనుగుకు తినిపించడంతో ఆ ఏనుగు మరణించిన విషయం తెలిసిందే. అత్యంత అమానవీయమైన ఈ ఘటనపై దేశం యావత్తు ఆవేదనతోపాటు ఆగ్రహం వ్యక్తంచేసింది. జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.
Mallapuram is know for its intense criminal activity specially with regards to animals. No action has ever been taken against a single poacher or wildlife killer so they keep doing it.
— Maneka Sanjay Gandhi (@Manekagandhibjp) June 3, 2020
I can only suggest that you call/email and ask for action pic.twitter.com/ii09qmb7xW
'మలప్పురం జిల్లాలో మూగజీవాలపై అమానుషంగా ప్రవర్తించే నేర ప్రవృత్తి ఎక్కువ. ఇప్పటి వరకు ఒక్క నేరస్తుడిపై కూడా చర్య తీసుకోలేదు. ఇలా అయితే, వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు' అని మేనకా గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు 600లకుపైగా ఏనుగుల హత్య జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మే 29న వెలుగులోకి వచ్చిన ఏనుగు హత్య ఘటన పాలక్కడ్ జిల్లాలో చోటు చేసుకుందని.. మలప్పురం జిల్లాలో కాదని న్యాయవాది సుభాష్ చంద్రన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు కొంతమంది మతం రంగు పులుముతున్నారని ఆరోపించారు. మలప్పురం జిల్లా వాసులను నేరస్తులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
ఇది ఇలావుండగా, ఏనుగు హత్య కేసులో పోలీసులు శుక్రవారం ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగితా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని కేరళ అటవీశాఖ మంత్రి తెలిపారు. అరెస్టైన వ్యక్తి స్థానికంగా పేలుడు పదార్థాలను అమ్ముతాడని పోలీసులు తెలిపారు. అడవిపందుల లాంటి క్రూర జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు కొందరు ఈ బాంబులను వినియోగిస్తారని పోలీసులు గుర్తించారు.