కేరళ ఏనుగు హత్య: పైనాపిల్ కాదు.. బాంబులు పెట్టిన కొబ్బరికాయ తినడంతోనే..
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏనుగు హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మరణించిన ఏనుగు తిన్నది అందరూ భావిస్తున్నట్లు పైనాపిల్ కాదని.. కొబ్బరికాయ అని అటవీశాఖ అధికారులు, పోలీసులు తేల్చారు.
Recommended Video
పైనాపిల్ కాదు.. కొబ్బరికాయలో బాంబులు..
పేలుడు పదార్థాలతో కూడిన కొబ్బరికాయను తినడంతోనే ఏనుగు నోరు తీవ్రంగా గాయపడిందని వెల్లడించారు. రోజుల తరబడి ఆహారం, నీరు కూడా తీసుకోలేని స్థితిలో ఉన్న ఆ గర్భిణీ ఏనుగు.. పాలక్కాడ్లోని వెల్లియార్ నదిలో ప్రాణాలు విడిచిందని తెలిపారు. దాదాపు 20 రోజులపాటు ఆ ఏనుగు ఆహారం తీసుకోకుండా ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు.
మరో ఇద్దరితో కలిసి బాంబులు తయారు చేసిన నిందితుడు
ఏనుగు హత్య కేసులో అరెస్టైన నిందితుడు విల్సన్ రబ్బరు సేకరించే వృత్తిలో ఉన్నాడని తెలిపారు. విచారణలో భాగంగా నిందితుడిని పేలుడు పదార్థాలు తయారుచేసిన ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అక్కడున్న షెడ్లో ఆ వ్యక్తి మరో ఇద్దరితో కలిసి పేలుడు పదార్థాలను తయారు చేశాడని తమ దర్యాప్తులో తేలిందని వివరించారు.
పరారీలోనే ఇద్దరు నిందితులు..
కాగా, ఈ ఏనుగు హత్య కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఏనుగు హత్యపై దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు స్పందించడంతో కేరళ సీఎం పినరయి విజయన్ ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు.
వెలుగులోకి వచ్చినవి రెండు ఘటనలే
ఏనుగు హత్య ఘటనలో నిందితులకు శిక్ష పడుతుందని, న్యాయం తప్పక జరుగుతుందని విజయన్ రెండ్రోజుల క్రితం స్పష్టం చేశారు. కాగా, కేరళలోనే మరో ఏనుగు కూడా ఇదే రకంగా హత్యకు గురికావడం గమనార్హం. స్థానికంగా రైతులు, ప్రజలు తమ పంటలను క్రూర మృగాలు, జంతువుల నుంచి కాపాడుకోవడం కోసం ఇలాంటి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తారని సమాచారం. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. కేరళలో సుమారు 600కుపైగా ఏనుగుల హత్యలు జరిగాయని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆరోపించారు. మలప్పురం జిల్లాలో జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించే వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ జిల్లా ప్రజలను అవమానించారంటూ మల్లప్పురంకు చెందిన ఓ న్యాయవాది మేనకా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.