దేశంలో బీజేపీ ప్రభంజనం... కేరళ మాత్రం "హస్త"గతం..
తిరువనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఊహించని రీతిలో ఓటర్లు ఆ పార్టీకి విజయం కట్టబెట్టారు. బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో బలం పెంచుకున్న బీజేపీకి కేరళ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ అక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కనీసం ఖాతా తెరవలేకపోయింది. రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయడం కాంగ్రెస్కు కలిసొచ్చింది.
సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. కార్యకర్తలను కలవనున్న మోడీ..
కేరళలో ప్రభావం చూపని బీజేపీ
ఈసారి సార్వత్రిక సమరంలో బీజేపీ గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇంత వరకు పెద్దగా ప్రభావం చూపని రాష్ట్రాల్లో కమలం పార్టీ తన సత్తా చాటింది. గత ఎన్నికల్లో ఒకట్రెండు స్థానాలకు పరిమితమైన రాష్ట్రాల్లో ఈసారి సీట్లు పెంచుకుంది. అయితే కేరళలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది.
ప్లస్ అవ్వని శబరిమల వివాదం
శబరిమల వివాదం ఈసారి ఎన్నికల్లో కలిసొస్తుందని బీజేపీ భావించింది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ చేపట్టిన ఉద్యమంతో ప్రజలు తమవైపు మొగ్గుచూపుతారని ఆశపడింది. దీంతో త్రిముఖ పోరులో విజయం నల్లేరు మీద నడకేనని భావించిన ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. ఉద్యమానికి జై కొట్టిన జనం... బీజేపీకి ఓటేసే విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ను ఓడించేందుకు మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ను బరిలో నిలిపింది. పట్టనంతిట్టంలో బీజేపీకి ఎదురుదెబ్బే తగిలింది.
కాంగ్రెస్కు కలిసొచ్చిన కాలం
దక్షిణాది నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ తొలిసారి బరిలో దిగడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఫలితంగా అక్కడ కనీవినీ ఎరగని విజయం సొంతం చేసుకుంది. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్తో జతకట్టిన కాంగ్రెస్ మొత్తం 20 సీట్లలో 14 మందిని పోటీకి దింపగా.. యూడీఎఫ్ ఆరుగురు అభ్యర్థుల్ని బరిలో దింపింది. వాటిలో 19స్థానాలను తన కాంగ్రెస్ కూటమి అకౌంట్లో వేసుకుంది. లెఫ్ట్ పార్టీలు కేవలం ఒక్క స్థానానికి పరిమితమయ్యాయి. శబరిమల అంశం బీజేపీకన్నా కాంగ్రెస్కు కలిసొచ్చినట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోంది.