అసలైన కరోనా వారియర్... ఆ రైతు చేస్తున్న పనికి జనం హ్యాట్సాఫ్... ఒక్క రూపాయి ఆశించకుండా...
ఎవరికైనా కరోనా వైరస్ సోకిందంటేనే... ఆ చుట్టుపక్కలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్న రోజులివి. అలాంటిది ఓ రైతు మాత్రం కరోనా పేషెంట్ల ఇళ్లను శానిటైజ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీనికోసం ఆయన ఎవరి వద్ద నుంచి డబ్బులు తీసుకోవట్లేదు.. తన సొంత ఎక్విప్మెంట్తోనే శానిటైజేషన్ చేస్తున్నాడు. కేరళలోని మలప్పురం జిల్లా ఎడప్పాల్కి చెందిన 51 ఏళ్ల లతీఫ్ కొలత్ అనే ఆ రైతుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. లతీఫ్ అసలైన కోవిడ్ 19 వారియర్ అని జనం ప్రశంసిస్తున్నారు.
ఇలా మొదలైంది...
లతీఫ్ తన స్వగ్రామం ఎడప్పాల్లో వ్యవసాయం చేస్తుంటాడు. కొద్దిరోజుల క్రితం లతీఫ్ ఇంటికి వచ్చిన కొంతమంది ఆరోగ్య శాఖ అధికారులు... పొలాల్లో క్రిమిసంహారక మందులు చల్లేందుకు ఉపయోగించే స్ప్రేయర్లను అరువుగా ఇవ్వాలని అతన్ని కోరారు. ఆ ప్రాంతంలోని కరోనా పేషెంట్ల ఇళ్లను శానిటైజేషన్ చేసేందుకు వాటిని ఉపయోగిస్తామన్నారు. అయితే స్ప్రేయర్లను ఇచ్చేందుకు నిరాకరించిన లతీఫ్... ఆ పనేదో తానే చేస్తానని ముందుకొచ్చాడు.
మొదట్లో భయపడ్డా...
'వాళ్లు నావద్దకు వచ్చి స్ప్రేయర్స్ కావాలని అడిగారు. కానీ వాళ్లు చేసే పనేదో నేనే చేయాలనుకున్నాను. ఎందుకంటే బ్యాటరీతో నడిచే ఈ స్ప్రేయర్స్ను ఉపయోగించాలంటే స్పెషల్ కేర్ అవసరం. చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే కరోనా పేషెంట్ల ఇళ్లను నేనే శానిటైజ్ చేస్తానని చెప్పాను. నిజానికి వైరస్ భయంతో మొదట్లో కాస్త భయపడ్డాను. కానీ కరోనాపై పోరులో భాగమైనందుకు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.' అని లతీఫ్ చెప్పాడు.
రెండు వారాల్లో 35 పైచిలుకు ఇళ్లు...
గత రెండు వారాల్లో లతీఫ్ 35 పైచిలుకు ఇళ్లను శానిటైజ్ చేశాడు. కోవిడ్ 19 ప్రోటోకాల్స్ పాటిస్తూనే శానిటైజేషన్ చేస్తున్నాడు. మొదట్లో ఒక రెయిన్ కోట్,ప్లాస్టిక్ బూట్లు ధరించి శానిటైజేషన్ చేసిన అతను... ఆ తర్వాత సొంతంగా పీపీఈ కిట్ కొనుగోలు చేశాడు. మొదట్లో తన భార్య,కొడుకు కూడా తన నిర్ణయానికి సంకోచించారని... తనకేమైనా అవుతుందేమోనని ఆందోళన చెందారని అన్నాడు. అయితే తాను నచ్చజెప్పడంతో చివరకు వాళ్లు కూడా ఒప్పుకున్నారని తెలిపాడు.
అటు రైతుగా... ఇటు కోవిడ్ 19 వారియర్గా...
ఆరోగ్య శాఖ అధికారులు కూడా తనకు సహకరిస్తున్నారని లతీఫ్ తెలిపాడు. శానిటైజేషన్కు అవసరమైన హైక్వాలిటీ బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తున్నారని చెప్పాడు. ఒక రైతుగా శానిటైజేషన్ పని చేయడం అంత సులువు కాదంటున్నాడు లతీఫ్. తాను తెల్లవారుజామునే 5గంటలకే నిద్ర లేచి... మధ్యాహ్నం 3గంటల వరకు తన పొలంలో పనిచేస్తానని చెప్పాడు. సాయంత్రం 4గంటల తర్వాత కరోనా పేషెంట్ల ఇళ్లను శానిటైజేషన్ చేసేందుకు వెళ్తానని చెప్పాడు. తన వద్ద ఆరు స్ప్రేయర్స్ ఉన్నాయని... అందులో ఒకదాన్ని ప్రత్యేకంగా శానిటైజేషన్ కోసం వాడుతున్నానని చెప్పాడు. ఇలా చేస్తున్నందుకు కొంతమంది డబ్బులు కూడా ఇచ్చారని... కానీ తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చాడు.