కేరళ ఆలయంలో ఘోరం: 105 మంది మృతి
కొల్లాం (కేరళ): కేరళలో భారీ అగ్ని ప్రమాదం సంఘటన చోటు చేసుకుంది. ఉత్సవ సంరంభంలో మునిగి తేలిన భక్తులకు విషాదాన్ని మిగిల్చింది. దైవ దర్శనానికి వచ్చినవారు పరలోకానికి పయనమయ్యారు. అనూహ్యంగా క్షణంలో చోటు చేసుకున్న సంఘటన 105 మందిని బలి తీసుకుంది. 300 మందికిపై గాయపడ్డారు.
కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆలయ వేడుకల్లో భాగంగా కొందరు భక్తులు బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆలయం నలువైపులా వ్యాపించాయి.
ఆలయంలో ఉన్న భక్తులు అగ్ని కీలలకు భయపడి భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. అగ్ని ప్రమాదంలో కొంత మంది, తొక్కిసలాటలో మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పివేశారు.
క్షతగాత్రులలో ఎక్కవ మందిని త్రివేండ్రం వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కేరళ ముఖ్యమంత్రి వూమెన్చాందీ, మంత్రులు ఘటనాస్థలికి బయలుదేరారు.
పుట్టింగల్దేవి ఆలయంలో మలయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో మీనాభరణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పెద్ద యెత్తున బాణసంచా కాల్చడం సంప్రదాయం. వీటితో పాటు అశ్వితి విలక్కు, కథాకళి, కంపడికాలి, మరమేడప్పు తదితర ఉత్సవాలను సైతం భారీగా నిర్వహిస్తారు. మీనాభరణి ఉత్సవం సందర్భంగా కొందరు భక్తులు బాణసంచా కాల్చడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కొల్లంలోని పుట్టింగల్దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంపై కేరళ సీఎం వూమెన్చాందీ న్యాయ విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు.