కేరళ ఫస్ట్..యూపీ లాస్ట్: ఆయా రాష్ట్రాల హెల్త్ ర్యాంకింగ్స్ను విడుదల చేసిన నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: ఆరోగ్య విషయంలో కేరళ రాష్ట్రం తొలిస్థానంలో ఉండగా... ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం చివరిస్థానంలో ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 23 సూచికలను ఆధారం చేసుకుని ఆయా రాష్ట్రాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 2015-16 ప్రారంభం నుంచి 2017-18వరకు ఆరోగ్యపరంగా ఆయా రాష్ట్రాల్లోని స్థితిగతులను నివేదిక ద్వారా బయటపెట్టింది నీతి ఆయోగ్. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలు ఆరోగ్యపరంగా తీసుకున్న అన్ని సూచీల్లో వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ రిపోర్టుకు హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా అని పేరు పెట్టారు.
ఇక ర్యాంకులు ఇచ్చేందుకు మూడు కేటగిరీలను పరిగణలోకి తీసుకుంది నీతి ఆయోగ్. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఒకే అంశంపై ఈ రాష్ట్రాలను పోల్చి చూసింది. పెద్ద రాష్ట్రాల్లో ఆరోగ్యపరంగా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బీహార్ ఒడిషా రాష్ట్రాలు ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఇక చిన్నరాష్ట్రాల విషయానికొస్తే ఈశాన్య రాష్ట్రాలు అయిన మిజోరాం, త్రిపురా, మణిపూర్ రాష్ట్రాలు టాప్ ప్లేస్ను సాధించగా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఆరోగ్యపరంగా పడిపోయాయని నీతి ఆయోగ్ రిపోర్టు వెల్లడించింది.ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీఘడ్ తొలి స్థానం ఆక్రమించగా...దాద్రా నగర్ హవేలీ ఆరోగ్యపరంగా పుంజుకున్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఆరోగ్యపరంగా ఆయా రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఆ ప్రభుత్వాలు ఆరోగ్యపరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మెన్ రాజీవ్ కుమార్ తెలిపారు. మరోవైపు కేంద్రప్రభుత్వం స్థూలదేశీయోత్పత్తి జీడీపీ నుంచి 2.5శాతం ఆరోగ్యంపై ఖర్చు చేయాలని నీతిఆయోగ్ సభ్యులు వినోద్ కుమార్ పాల్ తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యరంగంలో తమ బడ్జెట్లో 4.7 శాతం నుంచి 8శాతం కేటాయించాలని చెప్పారు.
ఇక ఆరోగ్యపరంగా వెనకబడిన బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు పలు అంశాలను విస్మరించినందుకే ఈ స్థితిలో ఉన్నాయని నీతి ఆయోగ్ గుర్తు చేసింది. ఉదాహరణకు బీహార్లో శిశుమరణాలు, పుట్టిన బిడ్డ సరైన బరువుతో పుట్టకపోవడం, టీబీ, చికిత్స వైఫల్యాలు, సరైన సదుపాయాలు లేకపోవడం, నేషనల్ హెల్త్ మిషన్ నుంచి సరైన సమయంలో నిధులు బదిలీ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారం ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో రూపొందించడం జరిగిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.