రియల్ హీరో: వరద దూసుకొస్తుంటే.. పరుగెత్తుతూ బాలుడ్ని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ అధికారి
తిరువనంతపురం: భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దాదాపు 37 మంది వరకు మృతి చెందారు. గత ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విలవిల్లాడుతోంది. దాదాపు సగం జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. నలభై నదులకు పైగా పొంగి పొర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి.
కేరళ వ్యాప్తంగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. వేలాది మంది అందులో ఆశ్రయం పొందుతున్నారు. వేలాది ఇళ్లు నేలమట్టం లేదా, పాక్షికంగా కూలిపోయాయి. కేరళలో ఉన్న జలాశయాల్లో గతంలో లేనంతగా 27 జలాశయాల గేట్లు ఎత్తివేసారు. 1924 తర్వాత ఇంతటి కుండపోత లేదని చెబుతున్నారు.
హ్యాట్సాప్ టు ఎన్డీఆర్ఎఫ్ అధికారి
కేరళలో భారీ వర్షాల కారణంగా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. ఎన్డీఆర్ఎప్లోని బీహార్కు చెందిన అధికారి కన్హయ కుమార్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేరళతో పాటు దేశవ్యాప్తంగా ఆయన వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ఆయన అద్భుత సాహసంతో ఓ బాలుడిని కాపాడాడు. ఇడుక్కి జిల్లాలో ఓ బాలుడ్ని కాపాడారు. అతనికి ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెబుతున్నారు. నెటిజన్లు ప్రశంల వర్షం కురిపిస్తున్నారు.
బాలుడికి జ్వరం
ఓ వైపు భారీ వరద తమ వైపు దూసుకు వస్తుండగా ఎన్డీఆర్ఎఫ్ అధికారి కన్హయ్య కుమార్ ఓ బాలుడిని ఎత్తుకొని పరుగెత్తాడు. ఆ బాలుడు జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. అలాంటి సమయంలో ఎన్డీఆర్ఎప్ అధికారి ఆ బాలుడిని ఎత్తుకొని పరుగెత్తాడు. ఆ సమయంలో అటువైపు వరద నీరు వేగంగా దూసుకు వస్తోంది. ఈ వీడియో ఒళ్లు జలదరించేలా ఉంది. అందుకే సదరు అధికారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
బాలుడ్ని పట్టుకొని దాటిన మరుక్షణమే నీట మునిగిన వంతెన
మరో షాకింగ్ విషయం ఏమంటే సదరు ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఆ బాలుడ్ని భుజంపై వేసుకొని వరద నీరు వస్తున్న వంతెన దాటాడు. అలా అతను వంతెన దాటాడో లేదో ఆ బ్రిడ్జి మొత్తం నీటితో మునిగిపోయింది. అంతకుముందే చెరుతోని డ్యామ్ నీటిని విడుదల చేశారు. ఆ వరద నీటి నుంచి బయటపడ్డారు.
ఇడుక్కిలో విధులు
కేరళలో భారీ వర్షాలు కురుస్తన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. వారి సేవలు అమోఘం. ప్రజలను కాపాడుతున్నారు. నీటిలో చిక్కుపోయిన వారికి ఆహారపొట్లాలు అందిస్తున్నారు. బాలుడిని కాపాడిన ఈ అధికారికి ఇడుక్కి జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. బాలుడిని కాపాడటంపై సదరు ఎన్డీఆర్ఎఫ్ అధికారి మాట్లాడుతూ.. ఈ బాధ్యతల్లో తాను ఆరేళ్లుగా పని చేస్తున్నాననిచెప్పారు.
వారి ఆదరాభిమానాలకు థ్యాంక్స్
బాలుడి పరిస్థితి చూసి వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలనుకున్నానని, ఆ పని చేశానని ఎన్డీఆర్ఎఫ్ అదికారి చెప్పారు. కానీ ఈ చిన్న పని వల్ల తనకు ఇంత పేరు వస్తుందని తాను భావించలేదని చెప్పారు. తన పట్ల ఇంత ప్రేమ, అభిమానం చూపిన ప్రజలకు తాను థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు.