వర్ష బీభత్సం: వరద నీటిలోనే కేరళ: 29కి చేరిన మృతుల సంఖ్య
తిరువనంతపురం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నదులు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద ప్రభావానికి రహదారులు కొట్టుకుపోయాయి.
Recommended Video
వరదనీటిలోనే కేరళ.. 29కి చేరిన మృతులు
కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రజారవాణా మొత్తం స్తంభించిపోయింది. వందల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలాయి. దీంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆకాశం నుంచి చూస్తే వరద నీటిలోనే కేరళ ఉన్నట్లు కనిపిస్తోంది. వరదనీటిలో ఎటూవెళ్లలేని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
సీఎం ఏరియల్ సర్వే..
కాగా, శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ నుంచి పరిస్థితిని పరిశీలించారు. ఆయనతో పాటు ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల, రెవెన్యూ మంత్రి చంద్రశేఖరన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టామ్ జోస్, పోలీస్ చీఫ్ లోక్నాథ్ బెహరా కూడా వరదల పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించారు.
మృతులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా..
షెడ్యూల్ ప్రకారం శనివారం ఇడుక్కీలో సీఎం వరదల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనువైన వాతావరణం లేకపోవడంతో విహంగ వీక్షణం తర్వాత సీఎం విమానం వయనాడ్ జిల్లాకు వెళ్లింది. అక్కడ కలెక్టర్, ఇతర అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. కాగా, వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.4లక్షలు, ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10లక్షలు పరిహారం కింద ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
రెడ్ అలర్ట్ ప్రకటించారు..
కాగా, ఇప్పటికే ఇడుక్కీ, వయనాడ్, మలప్పురం, కోజికొడె, పాలక్కడ్, కొట్టాయం, అలప్పుళా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, సైన్యం స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు మున్నార్లోని ప్లమ్ జూడీ రిసార్టులో చిక్కుకున్న 54 మంది పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళ ఎంపీలు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. కేరళ ప్రజలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా రాజ్నాథ్ వారికి చెప్పారు.