మార్కెట్లపై కేరళ వరదల ప్రభావం...నష్టాల్లో కొన్ని కంపెనీలు
Recommended Video
దేవుని సొంత దేశం కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. భారీ వర్షాలకు కేరళ అంతే భారీగా నష్టపోయింది. మంచి పర్యాటక ప్రాంతమైన కేరళ ఇప్పుడు వరదలతో అందవిహీనంగా తయారైంది. ప్రకృతి ప్రకోపానికి పర్యాటక ప్రాంతాలన్ని చెదిరిపోయాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటికే టీ, కాఫీ, రబ్బర్, యాలకులు సాగు చేసేవారికి దాదాపు రూ. 600కోట్లు నష్టం వాటిలిన్నట్లు తెలుస్తోంది.
వరదల వల్ల రాష్ట్రానికి రూ. 8,316 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు.ఆగష్టు 12వ తేదీన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కేరళ పర్యటనకు వచ్చిన సమయంలో పినరాయి విజయన్ ఓనివేదక అందజేశారు. వరదల తర్వాత కేరళ మరో విధంగా ఉంటుందని ఓ బడా ఇన్వెస్టర్ చెప్పారు. "వందేళ్లుగా ఇలాంటి దుస్థితిని కేరళ ఎప్పుడూ ఎదుర్కోలేదు. ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. మూడు రోజుల పాటు ప్రజలు అల్లాడిపోయారు. కొన్ని వేలమంది వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ వరద ఉధృతి పెరిగితే చనిపోతామనే భయం వారిలో నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, నేవీ దళాలు చాలా సహకారాన్ని అందిస్తున్నాయి. ప్రజలు సర్వం కోల్పోయారు" అని ఆ ఇన్వెస్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక కేరళ వాణిజ్యపరంగా కూడా మంచి కేంద్రం. చాలా లిస్టెడ్ కంపెనీలకు కేరళ నిలయంగా ఉంది. కేరళ వరదలతో సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ నష్టాల బాట పట్టినట్లు ఓ పారిశ్రామికవేత్త ట్వీట్ చేశారు. ఈ రెండు బ్యాంకులు 40శాతం నుంచి 45 శాతం లావాదేవీల్లో నష్టం చూసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు ముత్తూట్ ఫైనాన్స్ మనప్పురం గోల్డ్లు 15శాతం నష్టపోయినట్లు అవినాష్ అనే పారిశ్రామికవేత్త తెలిపారు. టైర్లు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ముడిసరుకు రబ్బర్ చాలా వరకు కేరళ నుంచే వస్తుందని ఇప్పుడు అది కూడా భారీగా నష్టం చవిచూసిందని చెప్పారు. రామ్కో సిమెంట్కు కూడా కేరళలో విపరీతమైన క్రేజ్ ఉందని అదికూడా నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది.
రబ్బర్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ఆరవ స్థానంలో నిలిచిందని ఇప్పుడు సంభవించిన వరదలతో 13.5 శాతం ఉత్పత్తి పడిపోయినట్లు తెలుస్తోంది. జూలైలో కురిసిన వర్షాలకు రబ్బర్ ఇండస్ట్రీ భారీగా నష్టపోయిందని తాజా వరదలతో అది మరింత పడిపోయిందని రైతులు మళ్లీ పండించలేరని ఇండియా ఆటోమోటివ్ టైర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ డీజీ రాజీవ్ భుద్రాజా తెలిపారు.
ఇదిలా ఉంటే వరదల ధాటికి బ్యాంకులు ఎలాంటి నష్టాలు చూడవని.. భారత ఆర్థిక వ్యవస్థపై వరదల ప్రభావం ఉండబోదని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ వ్యవస్థాపకులు చొక్కలింగం అన్నారు. అయితే కొన్ని కంపెనీలపై మాత్రం తాత్కాలికంగా ప్రభావం చూపుతుందని చెప్పారు. ఎందుకంటే ఆ కంపెనీలు ముడిసరుకుపై ఆధారపడి పనిచేస్తున్నాయని చొక్కలింగం చెప్పారు.