కేరళ వరదలు: మలయాళీ ఎన్నారై రూ. 50కోట్ల విరాళం, బజాజ్ రూ.2కోట్లు
Recommended Video
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు అనేకమంది తమ మంచి మనసుతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వ్యాపార సంస్థలు, ఎన్జీవోలు, చిన్నారులు కూడా మేముసైతం అంటూ కేరళకు సాయమందిస్తున్నారు.
మలయాళీ ఎన్నారై రూ.50కోట్ల విరాళం
తాజాగా, అబుదాబీలో స్థిరపడిన భారత సంతతి వ్యాపారవేత్త భారీ విరాళాన్ని ప్రకటించారు. అబుదాబీ కేంద్రంగా పనిచేసే వీపీఎస్ హెల్త్కేర్ సంస్థ ఛైర్మన్ డా. షంషీర్ వయలిల్ తన సొంత రాష్ట్రమైన కేరళకు 26మిలియన్ దుబాయ్ దిర్హమ్లను(దాదాపు రూ.50కోట్లు) విరాళం ఇచ్చారు.
సీఎం సహాయనిధికి..
షంషీర్ వయలిల్కు మధ్యఆసియా, భారత్, యూరప్లలో మొత్తం 22 ఆస్పత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి. డాక్టర్ షంషీర్ వయలిల్, తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చి కేరళ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చినట్లు సమాచారం. రూ.50కోట్లను కేరళ సీఎం సహాయ నిధికి షంషీర్ పంపించారు. కేరళను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా షంషీర్ అన్నారు.
బజాజ్ విరాళం రూ.2కోట్లు
ఇది ఇలా ఉండగా, ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో కూడా కేరళకు తమవంతు సాయం చేసింది. కేరళకు రూ.2కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రూ. కోటిని కేరళ సీఎం సహాయ నిధికి ఇస్తుండగా, మరో రూ.కోటిని జానకిదేవి బజాజ్ వికాస్ సంస్థకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సంస్థ ద్వారా కేరళ ప్రజలకు అవసరమైన వస్తు, సామాగ్రిని అందించనున్నట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటికే బజాజ్ ట్రస్ట్స్ నుంచి రూ.50లక్షలు కేరళకు విరాళంగా ఇచ్చారు. ఇక మరో ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్స్ కూడా కేరళ రాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ. కోటి ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ రూ. 2కోట్లు విరాళమిచ్చింది.
బాబా రాందేవ్ 50లక్షల విరాళం.. కోటిన్నర సేవలు
కేరళ వరద బాధితుల కోసం ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ రూ.50లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీంతోపాటు రూ. కోటిన్నర విలువ చేసే వస్తువులను కేరళ, కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సైన్యం చేపట్టిన సహాయక చర్యలను చూసి జాతి గర్విస్తుందన్నారు.