ప్రకృతి ప్రకోపానికి కొట్టుకుపోయిన మున్నార్ అందాలు
కేరళ వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ భయానక విపత్తు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చకు వచ్చింది. దేవభూమిగా పిలువబడే ఈ కేరళలో వరదలు అక్కడి ప్రజలకు నరకం చూపించాయి. అంతేకాదు అపార నష్టాన్ని కూడా కలిగించాయి. పర్యాటక పరంగా కోలుకోలేని దెబ్బతీశాయి.ఇక కేరళ వరదల్లో అత్యంత భారీగా నష్టపోయిన పర్యాటక ప్రాంతం మున్నార్. ఒక్క మున్నార్ ప్రాంతంలోనే 18 మంది మృతి చెందారు. ఇడుక్కి జిల్లాలో ఈ ప్రాంతమే వరదలకు అత్యంత భారీ మూల్యం చెల్లించుకుంది.
పర్యాటక ప్రాంతమైన మున్నార్లో వరదల ధాటికి అక్కడి రహదారులు, బ్రిడ్జీలు, పశ్చిమ కనుమలు అన్నీ ధ్వంసమయ్యాయి. ఇక 10రోజుల వరకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక ఆదివారం సమయానికి జిల్లా యంత్రాంగం మున్నార్ ఎర్నాకులంల మధ్య సంబంధాలను తిరిగి అనుసంధానం చేసింది. నెరియమంగళంలో కొండ చరియలు విరిగి పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో మున్నార్ ఎర్నాకులం మధ్య రాకపోకలకు విఘాతం ఏర్పడింది . కొండచరియలు విరిగి పడటంతో వాటికింద కార్లు, అలాగే చిక్కుకుని ఉన్నాయి. ఇక సోమవారం సమయానికి కొందరు వ్యాపారస్తులు కనిపించారు. సెల్ఫోన్ నెట్వర్క్లు ఇప్పటికీ పనిచేయలేదు. ఇక పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడున్న హోటళ్లు ఇంకా తెరుచుకోలేదు.
ఐదుగురి ప్రాణాలను కాపాడిన శునకం
మున్నార్ పట్టణం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలో బ్లాకీ అనే ఒక కుక్క కొండచరియలు విరగిపడుతున్నాయని ముందుగానే ఊహించి... గట్టిగా మొరిగి ఐదు మంది ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు ఆ శునకం అనారోగ్యంతో ఉంది. మున్నార్లో నివసించే తన బంధువులను చూద్దామని తను ఇంటికి వచ్చినట్లు చెప్పాడు తైజు అనే వ్యక్తి. ఆగష్టు 16 తెల్లవారుజామున బ్లాకీ అనే ఈ శునకం ఒక్కసారిగా మొరగడం మొదలుపెట్టిందని... అప్పటికే కొండచరియలు విరుగుతుండటం గమనించి ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకొన్నట్లు ఆనాటి చేదు జ్ఞాపకాలను తైజు నెమరువేసుకున్నాడు. ప్రస్తుతం ఆ శునకం అనారోగ్యంతో ఉందని చెప్పాడు.
వ్యాపారంవరదలతో మున్నార్లో కొన్ని కోట్ల నష్టం వచ్చింది
ఇక మున్నార్ పర్యాటక ప్రాంతం కావడంతో వరదలతో భారీ నష్టం చవిచూశామని హోటల్ నడుపుకునే వ్యక్తి సైదు మొహ్మద్ తెలిపారు. ఆర్థికంగా చాలా నష్టపోయినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ఓనం సందర్భంగా కురిసిన భారీ వర్షాలు తమ వ్యాపారాన్ని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మున్నార్లో 500కు పైగా లాడ్జీలు, రిసార్టులు, హోటళ్లున్నాయని చెప్పిన తైజు...వరదల కారణంగా కొన్ని కోట్ల నష్టం వచ్చిందని చెప్పాడు. ఇప్పటికీ తన హోటల్ తలుపులు తెరిచి 15రోజులు అవుతుందని బాధపడ్డాడు.
12 ఏళ్లకోసారి వచ్చే నీలకురింజి ఫ్లవర్ సీజన్
మున్నార్ను తమిళనాడులోని మరయూర్ ఉదుమల్పేట్ను కలిపే రహదారి పూర్తిగా దెబ్బతినింది. అది ఇప్పట్లో నిర్మాణం జరిగే అవకాశాలు కనిపించడంలేదు. అదీకాక పెరియావరై బ్రిడ్జిపై ఒక పెద్ద చీలిక ఏర్పడింది. ఇడుక్కి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న మణి ఆర్మీ సహకారం తీసుకుంటామని వెంటనే ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం అయ్యేలా చూడాలని కోరుతామని తెలిపారు. ఇక నీలకురింజి పూల సీజన్ కూడా భారీ వర్షాలకు దెబ్బతింది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సుందరమైన దృశ్యాన్ని చూసేందుకు దాదాపు 10 లక్షల మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఇక పర్వేజ్ అహ్మద్ అనే మరో కశ్మీరీ వ్యాపారస్తుడు కూడా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తను చివరిసారిగా జూలై 26న తన కశ్మీరీ శాలువలను ఒక అరబ్బు దేశ యువతికి విక్రయించినట్లు తెలిపాడు. మట్టుపెట్టి డ్యామ్ గేట్లు తెరిచిన తర్వాత మున్నార్ ప్రాంతమంతా కొట్టుకుపోయిందని చెప్పాడు.
దెబ్బతిన్న బ్రిటీషు కాలంనాటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఆఫ్ మున్నార్
ప్రఖ్యాతి గాంచిన మార్గరెట్ బ్రిడ్జి లేదా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఆఫ్ మున్నార్ కూడా వరదల ధాటికి దెబ్బతినింది. 1942లో ఈ 70 మీటర్ల బ్రిడ్జిని బ్రిటీషు వారు నిర్మించారు. ఇది కూడా ధ్వంసమైంది. ఇనుము పిల్లర్లు, చక్కసామగ్రితో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ముత్తిరాపుజ నదిపై ఉన్న ఈ బ్రిడ్జి పై నుంచి నడిచే స్థానికులు నదిని దాటి ఓల్డ్ మున్నార్ టౌన్ లేదా చొక్కనాడ్ ఎస్టేట్కు చేరుకుంటారని హోటల్ నడుపుతున్న ప్రవీణ్ అనే వ్యక్తి చెప్పాడు. తన హోటల్ ధ్వంసమైందనే బాధకంటే ఈ పురాతన బ్రిడ్జి ధ్వంసమైందన్న బాదే తనను ఎక్కువగా కలచివేస్తోందని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.