ప్రాణాలు ఫణంగా పెట్టి పైలట్ సాహసం: ఇంటిపైనే ల్యాండింగ్, 26మందిని కాపాడారు(వీడియో)
Recommended Video
తిరువనంతపురం: కేరళ భారీ వర్షాలకు దిక్కుతోచని స్థితిలో ఉన్న వరద బాధిత ప్రజలను ఎన్డీఆర్ఎస్ తోపాటు త్రివిధ దళాలు తమ శక్తినంత కూడగట్టుకుని వారిని కాపాడుతున్నాయి. గత వారం పది రోజులుగా కేరళలోని వరద ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నాయి.
తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి వరద బాధితులను కాపాడుతుండటం గమనార్హం. కాగా, ఓ ఇంట్లో చిక్కుకున్న 26మందిని కాపాడేందుకు ఓ హెలికాప్టర్ పైలట్ పెద్ద సాహసమే చేశారు. ఏ చిన్నపొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినా.. ధైర్యం చేసి వారందరినీ కాపాడారు.
బాధితులున్న ఇంటిపైనే..
ఆ వివరాల్లోకి వెళితే.. చాలకుడిలోని ఓ ఇంట్లో 26మంది చిక్కుకుపోయారు. బోట్లు వెళ్లలేని ఆ ప్రాంతానికి నావికాదళం సీకింగ్ 42బీ హెలికాప్టర్తో వెళ్లింది. అయితే, చుట్టూ నీరు ఉండటంతో హెలికాప్టర్ను ఎక్కడ దించాలో పైలెట్కు అర్థం కాలేదు. కానీ, ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి వరద బాధితులు చిక్కుకుపోయిన ఇంటిపైనే ఎంతో చాకచక్యంగా ల్యాండ్ చేశారు.
ఏమాత్రం పొరుపాటు జరిగినా హెలికాప్టర్ ముక్కలే..
ఇలాంటి సందర్భంలో ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా హెలికాప్టర్ ముక్కలైపోయేది. ఇంటిపైన హెలికాప్టర్ ల్యాండ్ కాగానే.. చకా చకా 26మందిని అందులో ఎక్కించారు. వెంటనే ఎంతో జాగ్రత్తగా హెలికాప్టర్ను గాల్లోకి లేపారు పైలెట్. కాగా, ఇదంతా వీడియోలో తీయడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. హెలికాప్టర్ పైలట్, ఇతర సహాయక సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వారిని కాపాడటం తప్ప మరో ఆలోచన లేదు..
రెస్క్యూ ఆపరేషన్ తర్వాత లెఫ్ట్నెంట్ కమాండర్ అభిజిత్ గార్డ్ మాట్లాడుతూ.. వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు మరో ఆలోచన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హెలికాప్టర్ చక్రాలను నేరుగా ఇంటికప్పుపై ఉంచితే ఆ బరువంతా ఇంటిపై పడుతుంది. అప్పుడు ఇంటిపై ఒత్తిడి పెరిగి ఇళ్లు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో హెలికాప్టర్ బరువు మొత్తం ఇంటిపై పడకుండా చక్రాలను కాస్త గాలిలోనే ఉంచాను. దాదాపు ఎనిమిది నిమిషాలు అలా ఒక స్థిరమైన ఎత్తులో హెలికాప్టర్ను ఉంచాల్సి వచ్చిందని అభిజిత్ తెలిపారు.
మాటల్లో చెప్పలేని నష్టం జరిగేది..
మరో నాలుగైదు సెకన్లపాటు హెలికాప్టర్ అలాగే ఇంటిపై ఉంచివుంటే ముక్కలైపోయేదని, దాన్ని మాటల్లో చెప్పలేమని అభిజిత్ తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపించిందని, ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక పైలట్ సామర్థ్యం బయటపడుతుందని వివరించారు. ‘ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం అయ్యేది కాదు. టీమ్ వర్క్. లెఫ్ట్నెంట్ కమాండర్ రజనీష్(కో-పైలెట్), లెఫ్ట్నెంట్ సత్యార్థ్(నావిగేటర్), అజిత్(వించ్ ఆపరేటర్), రాజన్(ఫ్రీ డ్రైవర్) మేమంతా కలిసి పనిచేశాం' అని అభిజిత్ తెలిపారు. కాగా, అభిజిత్ ఆధ్వర్యంలోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. కాగా, ఈ ఆపరేషన్లో 80ఏళ్ల వృద్ధురాలిని సైతం కాపాడారు.