మోడీ! కేరళకు మీరిచ్చింది సరిపోదు: రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి కౌంటర్
తిరువనంతపురం: భారీ వరదల కారణంగా కేరళలో పెను విపత్తు సంభవించిందని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోవని, మరిన్ని నిధులు విడుదల చేయాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. భారీ విపత్తు కారణంగా కేరళను ఆదుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణ ఆర్థిక సాయంగా రూ.500 కోట్లు ప్రకటించారు.
వరదల కారణంగా మృతిచెందినవారికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50 వేల వంతున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. శనివారం ఆయన వరద బాధిత ఆలువ త్రిసూర్ ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి విహంగ వీక్షణం చేశారు. దీనిపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.500కోట్లు ప్రకటించడం అభినందనీయమే కానీ, ఆ నిధులు సరిపోవన్నారు. డియర్ మోడీజీ.. వరదల్లో చిక్కుకున్న కేరళ పరిస్థితిని చూసి మీరు తక్షణ సాయం కింద రూ.500కోట్లు అందించడం బాగానే ఉంది.. కానీ ఆ నిధులు సరిపోవని, ఇప్పటికే దాదపు రూ.19,500కోట్లు నష్టం జరింగిందని విన్నానని పేర్కొన్నారు.
ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే కేరళకు ఎంతోకాలం పడుతుందన్నారు. మీరు ఈ విషయంలో కేరళకు బాసటగా నిలుస్తారని అనుకుంటున్నానని, కేరళ ప్రభుత్వం కోరిన రూ.2,000కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వడంలో మీరు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారని, కేరళ ప్రజలకు తగిన న్యాయం చేయండని ట్వీట్ చేశారు.
కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అంతకుముందు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలోనూ ఇదే విషయమై చర్చించారు.
కిరణ్ రిజిజు కౌంటర్
కేరళ విపత్తు నేపథ్యంలో మనమంతా ఒక్కటిగా ఉండాలని, ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వందలాది రెస్క్యూ టీంలు, 90 ఎయిర్ క్రాఫ్ట్స్, 50 మోటారుబోట్లు, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నావీ, పారా మిలిటరీ దళాలు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.