ఏడాది కాలంగా యువతిపై అత్యాచారం..మత మార్పిడి: పోలీస్ కమిషనర్ కు బీజేపీ మహిళా ఎంపీ ఫిర్యాదు.. !
బెంగళూరు: ఓ యువతిపై దారుణంగా ఆకృత్యానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఆమెను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్నో, మొన్ననో చోటు చేసుకున్న ఘటన కాదు ఇది. ఏడాదికాలంగా ఆ బాలిక వారి చెరలోనే ఉంటోంది. ఈ విషయం తన దృష్టికి రాగానే శరవేగంగా స్పందించారు భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీ. దీనిపై ఆమె పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనికోసం ఆ మహిళా ఎంపీ స్వయంగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రావడం చర్చనీయాంశమైంది.
ఆమే- శోభా కరంద్లాజే. కర్ణాటక బీజేపీ రాష్ట్రశాఖలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాయకురాలు. కర్ణాటకలోని ఉడుపి-చిక్ మగళూరు లోక్ సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆదివారం ఉదయం బెంగళూరు ఇన్ ఫాంట్రీ రోడ్ లో ఉన్న నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ భాస్కర్ రావును కలిశారు. యువతిపై ఏడాదికాలంగా కొనసాగుతున్న అత్యాచార సంఘటనపై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.
బాధితురాలు కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతానికి చెందిన యువతి అని, ప్రేమ పేరుతో ఓ ముస్లిం యువకుడు ఆమెను లోబర్చుకున్నాడని అన్నారు. అనంతరం ఆ యువతిని నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడుతున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాసర్ గోడ్ నుంచి తొలుత మంగళూరుకు, అనంతరం బెంగళూరుకు తీసుకొచ్చాడని చెప్పారు. అతని బారి నుంచి ఆ యువతిని వెంటనే విడిపించాలని కోరారు.
అనంతరం శోభా కరంద్లాజే విలేకరులతో మాట్లాడారు. సెక్యులర్ అని చెప్పుకొంటోన్న కేరళ ప్రభుత్వం.. ఈ ఉదంతంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక వర్గానికి న్యాయం చేయాలనే పేరుతో మెజారిటీ వర్గ ప్రజలను కేరళ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. కాసర్ గోడ్ యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను బలవంతంగా మతం మార్చించిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.