Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తుల సంఖ్య తగ్గించండి, సుప్రీంలో కేరళ ప్రభుత్వం మరోసారి వాదన !
శబరిమల/ కొచ్చి/ న్యూఢిల్లీ: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి వచ్చే భక్తులను తగ్గించాలని కేరళ ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు చేసింది. శబరిమల వెళ్లే భక్తుల సంఖ్యను తగ్గించాలని, హైకోర్టు తీర్పను సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే శబరిమల ఆలయం భక్తుల సంఖ్యను తగ్గించాలని ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం వెంటనే పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని సుప్రీం కోర్టుకు మరోసారి మనవి చేసింది. జనవరి 19వ తేదీతో శబరిమల ఆయ్యప్పస్వామి ఆలయం మూసివేస్తున్న సమయంలో కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో అయ్యప్పస్వామి భక్తులు షాక్ అవుతున్నారు.
Recommended Video
ఇదీ కేరళ ప్రభుత్వం తీరు
శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్యను కేరళ ప్రభుత్వం మొదట వెయ్యి మంది, తరువాత రెండు వేల మందిని పరిమితం చేసింది. శబరిమలకు ఎక్కువ మంది అయ్యప్పస్వామి భక్తులు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని స్వయంగా శబరిమల దేవస్వం బోర్డు అధికారులు కేరళ ప్రభుత్వానికి పదేపదే మనవి చేశారు. తరువాత కేరళ ప్రభుత్వం శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్యను 3 వేలకు పెంచింది.
హైకోర్టు ఆదేశాలు
శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను పెంచాలని అనేక మంది అయ్యప్పస్వామి భక్తులు మనవి చేసినా కేరళ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించలేదు. తరువాత అయ్యప్పస్వామి భక్తులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వైరస్ తాండవం చేస్తోందని, శబరిమలకు ఎక్కువ మంది భక్తులు వెళితే సమస్యలు వస్తాయని కేరళ ప్రభుత్వం హైకోర్టులో చెప్పింది. వాదనల విన్న కేరళ హైకోర్టు ప్రతిరోజూ 5, 000 మంది శబరిమలకు వెళ్లడానికి అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టులో ప్రభుత్వం పిటిషన్
కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా కేరళలో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని, శబరిమలకు ప్రతిరోజు 5, 000 మంది భక్తులు వస్తే మరింత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, వెంటనే శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను తగ్గించాలని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు మనవి చేసింది.
ప్రభుత్వం అత్యుత్సాహం ?
కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్ లో అనేక పొరపాట్లు ఉండటంతో వాటిని సరిదిద్ది మళ్లీ పిటిషన్ దాఖలు చెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. తరువాత క్రిస్ మస్ పండుగ, నూతన సంవత్సరం సెలవులు రావడంతో పిటిషన్ విచారణ వాయిదా పడింది. కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య తగ్గించాలని కేరళ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
కేరళ ప్రభుత్వం వాదన
వెంటనే పిటిషన్ విచారణకు స్వీకరించాలని సుప్రీం కోర్టు రిజిస్టార్ కు కేరళ ప్రభుత్వం తరపున జి. ప్రకాష్ లేఖ రాశారు. జనవరి 19వ తేదీ వరకు మాత్రమే అయ్యప్పస్వామి భక్తులు శబరిమలకు వెళ్లడానికి అవకాశం ఉన్న సమయంలో కేరళ ప్రభుత్వం మరోసారి అత్యుత్సాహం చూపిస్తోందని అయ్యప్పస్వామి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.