శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక వేడుకలు రద్దు: భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా నమోదవుతున్న ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తులు స్వల్ప సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, మరో 2 మరణాలు
శబరిమల వార్షిక ఉత్సవాలు రద్దు..
ప్రముఖ అయ్యప్ప స్వామి ఆలయం కూడా త్వరలోనే తెరుచుకుంటుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, కరోనా కేసులు రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ తంత్రి కందరారు మహేశ్ మనోహరు తో ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్ ప్రెసిడెంట్, ఇతర అధికారులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. జూన్ 19 నుంచి నిర్వహించాల్సిన శబరిమల వార్షిక ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని పేర్కొంది.
భక్తులకు అనుమతి లేదు..
అయితే, ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులకు అనుమతి లేదని తెలిపింది. శబరిమల ఆలయంలోకి ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని, వర్చువల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రద్దీని నియంత్రిస్తామని సీఎం విజయన్ కొన్ని రోజుల క్రితం చెప్పారు. అయితే, కరోనా రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, భక్తులను ఎప్పట్నుంచి తిరిగి అనుమితిస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
కేరళలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
కాగా, కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2162 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1239 యాక్టివ్ కేసులున్నాయి. 905 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 మరణాలు సంభవించాయి. గతంలో కొద్ది వారాల క్రితం కరోనా ఫ్రీ అవుతుందనుకున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి కరోనా విజృంభించడంతో సర్కారు నివారణ చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.