శబరిమల భక్తుల పెంపుపై సుప్రీంకు కేరళ సర్కార్- హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ
శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శబరిమలకు వస్తున్న భక్తులకు కోవిడ్ జాగ్రత్తలతో దర్శనాలకు అనుమతిస్తున్న కేరళ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో వీటిని సవాల్ చేస్తూ కేరళలోని పినరయి విజయన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కేరళలోని శబరిమలకు వచ్చే రోజువారీ భక్తుల సంఖ్యను వారం పొడవునా 2 వేలు గానూ, వారాంతంలో 3 వేలుగానూ తాజాగా ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయించింది. కానీ ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న భక్తుల్లో 40 శాతం మంది దర్శనాలకు రావడం లేదనే కారణంతో దీన్ని ఐదు వేలకు పెంచాలని తాజాగా కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేరళ సర్కార్.. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
శబరిమలకు వచ్చే రోజువారీ భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులతో పాటు కోవిడ్ విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. మండలపూజ సీజన్ అయిన డిసెంబర్ 20 నుంచి జనవరి 14వరకూ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివస్తారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా ఈ సంఖ్యను ప్రభుత్వం పరిమితం చేసింది. అయితే భక్తుల సంఖ్య పెంచాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం కేరళలో స్ధానిక సంస్ధల ఎన్నికలు ముగిశాక కరోనా కేసులు పెరిగాయని, బ్రిటన్ నుంచి కొత్తరకం కరోనా వైరస్ రాష్ట్రానికి వచ్చే అవకాశముందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆయా అంశాల దృష్ట్యా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.