శబరిమల వివాదంపై కేరళ సర్కార్ యూ టర్న్..! పార్లమెంట్ ఫలితాల ఎఫెక్టేనా..?
తిరువనంతపురం : శబరిమల టెంపుల్ సంప్రదాయాలను కాపాడాలంటూ కేరళ ప్రభుత్వం స్వరం మార్చడం చర్చానీయాంశమైంది. గతేడాది సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా 50 ఏళ్ల లోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో దుమారం రేగింది. ఆ సమయంలో ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నామంటూ హిందు సంఘాల ఆగ్రహానికి గురైంది. అయితే తాజాగా యూ టర్న్ తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శబరిమల వివాదంపై కేరళలో పాలక వామపక్ష ప్రభుత్వం స్వరం మారింది. లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీకి ఓట్ల శాతం పెరగడంతో సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వం శబరిమల ఆలయ వివాదంపై మెతక వైఖరి అవలంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా శబరిమల ఆలయ సంప్రదాయాలను పరిరక్షించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ కోరడం విశేషం.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం.. కాళేశ్వరం విశిష్టతలేంటంటే..!
శబరిమల సంప్రదాయాలు కాపాడాలి..!
10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు, బాలికలను శబరిమల ఆలయంలోకి అనుమతించరాదన్నది తరతరాలుగా వస్తున్న ఆలయ సంప్రదాయం. అయితే గతేడాది సెప్టెంబర్ నెల చివరలో ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేరళ వామపక్ష ప్రభుత్వం వ్యవహరించింది. అదలావుంటే సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని బీజేపీ, ఆరెస్సెస్ సహా హిందూ సంస్ధలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి.
హిందూ సంఘాల ఆందోళనలతో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు పెద్ద దెబ్బ తగిలింది. గణనీయంగా ఓట్ల శాతం తగ్గడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లైంది. ఆ క్రమంలో శబరిమల ఆలయ సంప్రదాయాలను కాపాడాలని కోరుతూ చట్టం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఒకవేళ చట్టం చేయడానికి చాలా సమయం తీసుకుంటే.. అప్పటిలోగా ఆర్డినెన్స్ తీసుకురావాలని దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ కోరడం విశేషం.
దశబ్ధాల నిబంధనలకు బ్రేక్
శబరిమల ఆలయంలోకి మహిళలు రాకూడదనే నిబంధన దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదస్పదంగా మారింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తూ సెప్టెంబర్ 28న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. మతాచారాల పేరిట మహిళలపై వివక్ష చూపించడం తగదని.. అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నమని పేర్కొంది. అంతేకాదు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. దీంతో అయ్యప్ప భక్తులతో పాటు హిందు సంఘాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించాయి.
బ్యాడ్ చీఫ్ మినిస్టర్..!
శబరిమల వివాదం కొనసాగిన సమయంలో కేరళ సీఎం పినరయి విజయన్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గూగుల్లో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ ఎవరా అని ఆరా తీస్తే ఈయన పేరు దర్శనమిచ్చింది. అంతలా ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు, హిందు భావజాల సంఘాలు ఆయన తీరును బహిరంగంగా ఎండగట్టారు. ఆ క్రమంలో పినరయి విజయన్ను వ్యతిరేకిస్తూ చాలాచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి.
లోక్సభ ఫలితాల తర్వాత యూ టర్న్
శబరిమల వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపితే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం కూల్గా ఉన్నట్లు కనిపించింది. అయితే మొన్నటి లోక్సభ ఎన్నికలు జరిగాక కేరళలో తమదే విజయమంటూ కాలర్ ఎగురవేసిన విజయన్.. ఫలితాలు వచ్చాక డీలా పడ్డారు. శబరిమల పేరుతో కేరళలో అల్లర్లు సృష్టించింది బీజేపీయే అంటూ వ్యతిరేక ప్రచారం నిర్వహించినా లాభం లేకపోయింది.
ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక మీడియాతో మాట్లాడిన విజయన్.. కేరళలో తమ పార్టీ భారీ విజయం నమోదు చేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. అయితే రింగ్ రివర్స్ కావడంతో మెతకపడినట్లు తెలుస్తోంది. మొత్తానికి లోక్సభ ఫలితాల దెబ్బతో దిగొచ్చిన విజయన్ సర్కార్.. శబరిమల సంప్రదాయాలు కాపాడాలంటూ కేంద్రాన్ని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.