సీఏఏపై సుప్రీంకోర్టుకు..: కేరళ సర్కారు నుంచి నివేదిక కోరిన గవర్నర్
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్కు తెలియజేయలేదు. దీనిపై ఇప్పటికే ఆయన కేరళ సీఎం పినరయి విజయన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత జరిగితే తనకు మాట మాత్రం చెప్పరా? అంటూ మండిపడ్డారు. తానేమీ రబ్బరు స్టాంప్ కాదంటూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఇందుకు సంబంధించిన నివేదికను తనకు సమర్పించాలంటూ కేరళ సర్కారును ఆదేశించారు గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్.
రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేయబోమంటూ కేరళ అసెంబ్లీలో తీర్మానం చేయడంపైనా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలు జరుగుతుంటే తాను మౌనంగా ఉండలేనని, లాండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. రాజ్యాంగాన్ని అందరూ పాటించాల్సి ఉంటుందని, ఇది తన వ్యక్తగత యుద్ధం కాదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేరళ సర్కారు, గవర్నర్ మధ్య వివాదం నెలకొంది.
కాగా, భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు సీఏఏ భంగం కలిగిస్తోందంటూ కేరళ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 14, 21, 25 అధికరణలకు సీఏఏ వ్యతిరేకంగా ఉందని, దీన్ని రాజ్యాంగానికి, లౌకిక నిర్మాణానికి విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరింది.
కేరళతోపాటు పశ్చిమబెంగాల్ పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తదితర రాష్ట్రాలు సీఏఏను అమలు చేయబోమంటూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. అయితే, పార్లమెంటు ఆమోదం పొందిన సీఏఏను రాష్ట్రాలు అడ్డుకోలేవని, అది రాజ్యాంగ విరుద్ధమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.