వైఎస్ జగన్ బాటలో మరో ముఖ్యమంత్రి: ఏపీ తరహాలో అక్కడా దానిపై నిషేధం..!
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వ అడుగు జాడల్లో నడుస్తోంది. మన రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించినట్టే.. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
షాకింగ్: మహా సీఎం రేసులో సంజయ్ రౌత్: ఉద్ధవ్ కు వద్దనుకుంటే.. ఇక ఆయనే
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నిషేధం విధించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ ప్లేట్లు, కూలింగ్ ఫిల్ములు, థర్మొకోల్ ఆధారిత ఫ్యాన్సీ వస్తువులు, స్టైరోఫోమ్ తో తయారు చేసిన అన్ని రకాల వస్తువుల వినియోగాన్ని జనవరి 1వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, ఫోర్కులు, స్ట్రా, మంచినీటి పాకెట్లు, జ్యూస్ పాకెట్లు, పెట్ బోటిళ్లు, చెత్తను తరలించడానికి వినియోగించే ప్లాస్టిక్ సంచులు, పీవీసీ ఫ్లెక్సీలను తయారు చేయడానికిి వినియోగించే సామాగ్రిపైని కూడా ఈ నిషేధం పరిధిలోకి తీసుకొచ్చింది కేరళ సర్కార్. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 కింద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
నిషేధ సమయంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. వాటి వినియోగంపై నిఘా వేయడానికి కాలుష్య నియంత్రణ మండలిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. నిషేధాన్ని ఉల్లంఘించి ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లను తయారు చేసే సంస్థలు, కర్మాగారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
తొలి దశలో 10 వేల రూపాయల జరిమానాను విధించాలని, దాన్ని పదేపదే ఉల్లంఘిస్తే 50 వేల రూపాయల వరకు జరిమానా, జైలు శిక్షను విధిస్తామని హెచ్చరించారు. మంచినీటి పాకెట్లకు ప్రత్యామ్నాయంగా బోటిళ్లను అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం విధించిన మూడో రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది.