గ్రానీ గిఫ్ట్ : పరీక్షలో విజయం సాధించిన ఈ బామ్మకు కేరళ ప్రభుత్వం అందించిన బహుమానం ఇదే
కేరళలో అక్షరాస్యత 100శాతం సాధించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో కార్తీయని అమ్మ అనే 96 ఏళ్ల బామ్మ 90శాతం మార్కులతో పరీక్షలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ బామ్మను ప్రపంచమంతా మెచ్చుకుంది. ఆ వయస్సులో ఆమె పరీక్ష రాయడం అనేది గొప్ప విషయమైతే అందులో 90శాతం మార్కులు సాధించడం మరో గొప్ప సంగతి అంటూ అందరూ కొనియాడారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సైతం బామ్మను ప్రశంసించారు.
పరీక్షలో విజయం సాధించింనందుకు బామ్మకు ల్యాప్టాప్ బహుమానం
ఇక అసలు విషయానికొస్తే 96 ఏళ్ల కార్తీయాయని అమ్మ అనే ఈ బామ్మ అక్షరలక్ష్యం పథకం కింద కేరళ ప్రభుత్వం నిర్వహించిన పరీక్ష రాసి విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ బామ్మకు ఒక ల్యాప్టాప్ కానుకగా బహూకరించింది. ఈ ల్యాప్టాప్ను స్వయంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రవీంద్రనాథ్ అందజేయడమే విశేషం. పరీక్షలో విజయం సాధించిన తర్వాత బామ్మ తన మనసులో మాటను బయటపెట్టింది. తనకు చదువంటే చాలా ఇష్టమని చెబుతూ... తనకు అవకాశం ఉంటే కంప్యూటర్స్ గురించి చదువాలనే ఆమె కోరికను బయటపెట్టింది. దీంతో కేరళ ప్రభుత్వం ముందుకొచ్చి బామ్మకు కంప్యూటర్ బహూకరించింది.
సంపూర్ణ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా కేరళను ప్రకటించిన యూనెస్కో
అక్షరలక్ష్యం పేరుతో నిర్వహించిన అక్షరాస్యత పరీక్ష తమ రాష్ట్రంలో ఎంత అక్షరాస్యత ఉన్నది అంచనా వేస్తుంది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే దేశం మొత్తం మీద 90 శాతానికి పైగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ తొలిస్థానంలో ఉంది.ఈ పరీక్షలో 42,933 మంది పాస్ అయ్యారు. దీంతో 100శాతం అక్షరాస్యత దిశగా కేరళ దూసుకెళుతోంది. 1991 ఏప్రిల్ 18న 90శాతానికి పైగా అక్షరాస్యత నమోదు కావడంతో కేరళ రాష్ట్రాన్ని యూనెస్కో పూర్తి అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ప్రకటించింది.
ప్రతి ఏటా జనవరి 26న అక్షరలక్ష్యం పేరుతో పరీక్ష
2011 గణాంకాల ప్రకారం కేరళలో ఇంకా 18 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 100శాతం అక్షరాస్యత నమోదు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది జనవరి 26న అక్షర లక్ష్యం పేరుతో కేరళ ప్రభుత్వం పరీక్ష నిర్వహించింది. దీని వెనకున్న ముఖ్య ఉద్దేశం గిరిజనులు, మత్స్యకారులు, ఇతరత్ర వెనకబడినవారిలో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించడం కోసమే అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.