ట్రాన్స్ జెండర్ల లింగమార్పిడి కోసం రూ.2లక్షలు చెల్లించనున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం
దేవుని సొంత దేశంగా ప్రసిద్ధి చెందింది కేరళ రాష్ట్రం. ఇప్పటికే 100శాతం పూర్తి స్థాయిలో ప్రాథమిక విద్యను అందిస్తున్న రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన కేరళ.. జనాభా నియంత్రణలో కూడా ముందు వరుసలో నిలిచింది. గత పదేళ్లలో చూస్తే కేరళ రాష్ట్రంలో జనాభా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఇక అన్నిటికంటే ఆసక్తికర విషయం ఏమిటంటే...ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, విధానాలు అందరిని ఆకట్టుకుంటాయి. తాజాగా ట్రాన్స్జెండర్లు సమాజంలో తలెత్తుకుని బతకాలని భావించిన ప్రభుత్వం వారికోసం కొత్త విధానాలను ప్రవేశపెట్టింది.
ట్రాన్స్ జెండర్లుగా మారేందుకు ఆసక్తి ఉండి లింగమార్పిడి చేసుకునే వారికి అయ్యే సర్జరీ ఖర్చు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఆ రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు సమాచారం. సర్జరీ, ఇతరత్రా హాస్పిటల్ ఖర్చులు మొత్తం రూ.2లక్షల వరకు నగదును చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు ఇప్పటికే సర్జరీ చేసుకున్న వారికి కూడా ఇదే డబ్బులను చెల్లించాలని నిర్ణయించింది. అట్టివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది.
ఒక మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని అది పురుషుడిగానైనా సరే, స్త్రీగా అయినా సరే అని అభిప్రాయపడ్డ సీఎం పినరాయి విజయన్... ట్రాన్స్ జెండర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని చెబుతూ ఇదే విషయాన్ని తన అధికారిక ఫేస్బుక్ పేజ్పై రాసుకున్నారు. ట్రాన్స్జెండర్లకు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో అవకాశాలు ఇప్పటికే కల్పిస్తూ వచ్చిన ప్రభుత్వం తాజాగా లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్ జెండర్గా మారుతున్న వారికి ఆర్థికంగా అండగా నిలవాలని భావిస్తోంది. ఇందుకోసమే వారికి రూ.2లక్షలు ఇస్తున్నట్లు సీఎం పినరాయి విజయన్ చెప్పారు.
ఇదిలా ఉంటే 2015లో ట్రాన్స్జెండర్ల కోసం కొత్త విధానాలు రూపొందించిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్రలో నిలిచింది. అంతేకాదు ట్రాన్స్ జెండర్ వర్గానికి ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో రెండు సీట్లను కేటాయిస్తూ ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జీవోలను విడుదల చేసింది. సామాజిక న్యాయ శాఖ ట్రాన్స్జెండర్ల కోసం స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించగా... కొచ్చి మెట్రో ట్రాన్స్ జెండర్లను తమ సంస్థలో ఉద్యోగాలను కలిపించింది.