మందుబాబులు ఎగిరి గంతేసేలా: డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటే మద్యం: తెలంగాణ కూడా అనుసరించేలా..!
తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. మద్యం ప్రియులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ వల్ల అందరికంటే ఎక్కువగా బాధపడిపోతున్నదెవరైనా ఉన్నారంటే అది.. మద్యంబాబులే. రోజూ మద్యం కిక్కు నషాళానికి ఎక్కనిదే నిద్ర కూడా పట్టని మద్యపాన ప్రియులు డిప్రెషన్కు గురవుతున్నారు. ఆత్మహత్యకు సైతం పాల్పడటానికి వెనుకాడట్లేదు.
అమెరికా..చేతులెత్తేసిందా?: రెండు వారాలు భయానకం: లక్షమందికిపైగా: బాంబు పేల్చిన ట్రంప్..!
కేరళలో బలవన్మరణాలు తీవ్రం..
మద్యం దొరక్కపోవడం వల్ల కేరళలో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కేరళలో ఏడుమంది ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు మరణించగా.. మిగిలిన నలుగురు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నలుగురినీ డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించారు. కేరళ ఉత్తర ప్రాంతంలోని కన్నూర్, మళప్పురం, కొల్లం వంటి జిల్లాల్లో ఈ ఆత్మహత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. కొల్లంలో ఇద్దరు, కన్నూర్లో ఒక్కరు మరణించారు.
ఆంక్షలను సడళించిన కేరళ సర్కార్..
ఈ పరిస్థితుల్లో మద్యం అమ్మకాలపై కొనసాగుతోన్న లాక్డౌన్ ఆంక్షలను సడళించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య ప్రయత్నాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. స్వేచ్ఛగా మద్యం విక్రయాలను కొనసాగించడానికి బదులుగా.. పరిమితంగా వాటిని సరఫరా చేయాలని ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉన్న వారికి, వాటిని చూపించిన బాధితులకు మాత్రమే మద్యాన్ని సరఫరా చేయాలని ఆదేశించారు.
మద్యానికి బానిసగా మారిన వారి సంఖ్య 16 లక్షల వరకు
మద్యానికి బానిసగా మారిన వారి సంఖ్య కనీసం 16 లక్షల వరకు ఉండొచ్చని కేరళ ఎక్సైజ్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. లాక్డౌన్ పరిస్థితుల వల్ల వారందరూ ప్రస్తుతం మద్యం దొరకని దుస్థితిని ఎదుర్కొంటున్నారని, డిప్రెషన్లోకి వెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలను పాక్షికంగా కొనసాగించేలా చర్యలను చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఓ నివేదికను అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి పినరయి.. ఆమోద ముద్ర వేశారు. డాక్టర్ ప్రిస్కిప్షన్కు అనుగుణంగా డిప్రెషన్కు గురైన వారికి మాత్రమే మద్యాన్ని సరఫరా చేయాలని సూచించారు.
అన్ని జిల్లాల్లోనూ డీ-అడిక్షన్ కేంద్రాలు..
దీనితోపాటు- రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ డీ-అడిక్షన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని పినరయి ఆదేశించారు. ఆత్మహత్యలు అధికంగా పాల్పడటానికి అవకాశం ఉన్న జిల్లాల్లో తొలిదశలో ఈ డీ-అడిక్షన్ కేంద్రాలను నెలకొల్పాలని చెప్పారు. మద్యం దొరక్కపోవడం వల్ల తెలంగాణలో కూడా ఇదే తరహా వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మద్యానికి ప్రత్యామ్నాయంగా మందుబాబులు కల్లుపై ఆధారపడుతున్నారు. మద్యం లేక, అటు నాణ్యమైన కల్లు దొరక్క డిప్రెషన్కు గురవుతున్నారు. తాజాగా- కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని తెలంగాణ కూడా అనుసరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.