ముద్దులకు అడ్డం రాం: కిస్ ఫెస్ట్పై కేరళ హైకోర్టు
కొచ్చి: మోరల్ పోలీసింగ్ను నిరసిస్తూ నవంబర్ 2వ తేదీన నిర్వహించాలని తలపెట్టిన కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కొంత మంది ఫేస్బుక్ ఖాతాదారుల గ్రూప్ తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని నిషేధించాలని కేరళ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ పని జరిగినా దాన్ని అడ్డుకోవడానికి తగిన స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని కోర్టుకు రాష్టర్ ప్రభుత్వం తెలియజేసింది. దీంతో ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాల, శ్రీ సత్యసాయి అనాథల ట్రస్టుకు చెందిన ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎఎం షఫీక్లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది.
భారత శిక్షాస్మృతిలోని నిబంధనలను కిస్ ఫెస్ట్ ఉల్లంఘిస్తోందని, ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని పిటిషన్లో అన్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యతను నిరోధించాల్సిందిగా ఎర్నాకులం జిల్లా కలెక్టర్ను, నగర పోలీసు కమిషనర్ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.
నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు భంగం కలిగించకూడదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల ఓ ఫేస్బుక్ పోస్టులో అభిప్రాయపడ్డారు. అయితే, నిరసనకారులు మాత్రం శాంతిభద్రతల సమస్యను సృష్టించకూడదని ఆయన అన్నారు.
కోజికోడ్లోని ఓ హోటల్లో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గతవారం కొంత మంది బిజెవైఎం కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. దానికి నిరసనగా నవంబర్ 2వ తేదీ ఆదివారంనాడు కౌగిలింతలు, ముద్దులతో బహిరంగ నిరసన నిర్వహించాలని వివిధ వర్గాలు నిర్ణయించాయి.