మద్యం సేవించి కారుతో బైకును ఢీకొన్న కలెక్టర్... జర్నలిస్టు మృతి
తిరువనంతపురం: ఒకరికి మాదిరికరంగా ఉండాల్సిన కలెక్టరే దారి తప్పాడు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఐఏఎస్ ఆఫీసరే మద్యం సేవించి వాహనం నడిపాడు. అంతేకాదు మద్యం మత్తులో ఏ రేంజ్లో వేగంగా నడిపుతున్నాడో మరిచిన కలెక్టర్ ఓ జర్నలిస్టును ఢీకొట్టాడు. దీంతో జర్నలిస్టు మృతి చెందాడు.
కేరళలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీరాం వెంకట్రామన్ దారి తప్పాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వెంకట్రామన్ మద్యం సేవించి వాహనం నడపరాదన్న ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. తిరువనంతపురంలో ఫుల్గా మందు కొట్టి తన కారును అతివేగంగా నడిపి ఓ జర్నలిస్టు మృతికి కారణమయ్యాడు. మళయాళ పత్రిక సిరాజ్కు బ్యూరో చీఫ్గా పనిచేస్తున్న జర్నలిస్టు కేఎం బషీర్ తన బైకు పై వెళుతుండగా వెంకట్రామన్ తన కారుతో ఢీకొట్టడంతో బషీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగింది. మరోవైపు తీవ్రంగా గాయపడిన కలెక్టర్ శ్రీరాంను చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు.
బషీర్ బైకును ఢీకొట్టిన తర్వాత ప్రమాదంను గ్రహించి కారులోనుంచి బయటకు దిగిన కలెక్టర్ వెంకట్రామన్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేసినట్లు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆటోడ్రైవర్ మణికుట్టన్ తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ మధ్యే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో ఓ కోర్సు చదివి భారత్కు గతవారమే వచ్చినట్లు సమాచారం. అనంతరం సర్వే మరియు భూరికార్డు శాఖ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. 2012 సివిల్స్లో రెండో ర్యాంక్ సాధించారు. ఇడుక్కి జిల్లాలోని దేవీకులం సబ్కలెక్టర్గా పనిచేసిన సమయంలో ల్యాండ్ మాఫియాలకు చెక్ పెట్టిన రికార్డు వెంకట్రామన్కుంది. నాడు కమ్యూనిస్టు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడంతో ఆయన్ను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయడం జరిగింది.