ఐఎస్ఐఎస్ తీర్థం పుచ్చుకున్న కేరళ రిపోర్టర్?
న్యూఢిల్లీ/కేరళ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడైన ఒక రిపోర్టర్ గుట్టుచప్పుడు కాకుండా తీవ్రవాద గ్రూప్ లో చేరిపోయాడు. విషయం తెలుసుకున్న భారత ఇంటిజెన్స్ వర్గాలు షాక్ కు గురైనారు.
వెంటనే ఇంటిలిజెన్స్ వర్గాలు కేరళ ప్రభుత్వానికి, అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. కేరళలోని పాలక్కాడ్ లో నివాసం ఉంటు స్థానిక దినపత్రికలో రిపోర్టర్ గా పని చేస్తున్న వ్యక్తి సిరియాలో ఉన్నాడని కేరళ పోలీసులకు సమాచారం అందించారు.
పాలక్కాడ్ లో పని చేస్తున్న అతను భారత్ నుండి నేరుగా సిరియాకు వెళ్లలేదని ఇంటిలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. పాలక్కాడ్ లో దినపత్రికలో పని చేసే సమయంలో అతను కుటుంబ సభ్యుల దగ్గర నిత్యం ఐఎస్ఐఎస్ గురించి చర్చించేవాడని వెలుగు చూసింది.
ఆ సందర్బంలో కుటుంబ సభ్యులు బుద్దిమాటలు చెప్పి ఉగ్రవాదులతో చేతులు కలపరాదని అతనికి సూచించారు. అతని తండ్రి పలు సార్లు హెచ్చరించారు. అయితే ఒక సంవత్సరం పాటు ఐఎస్ఐఎస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న ఆ రిపోర్టర్ తరువాత స్థానిక దినపత్రికలో ఉద్యోగం నిలిపివేశాడు.
చివరికి గల్ఫ్ దేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. 8 నెలల క్రితం గల్ఫ్ దేశంలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. అక్కడి నుండి అతను సిరియా వెళ్లాడని ఇంటిలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. అయితే సిరియాలో అతను ఎక్కడ ఉన్నాడనే విషయం కచ్చితంగా తెలియడం లేదని అధికారులు తెలిపారు.
కేరళ ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం ఆ రిపోర్టర్ గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. ప్రస్తుతం అతను కేరళలో ఉన్న వారితో సంపద్రిస్తున్నాడా, ఎవరెవరితో అతనికి సబంధాలు ఉన్నాయని విషయాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.