లా విద్యార్థిని రేప్, హత్య కేసు: దోషికి మరణ దండన
Recommended Video
కొచ్చి: కేరళ లా విద్యార్థిని హత్య, రేప్ కేసులో నిందితుడు అమీరుల్ ఇస్లాంంకు ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్ కోర్టు మరణ దండన విధించింది. ఇప్పటికే అతన్ని దోషిగా నిర్ధారించిన కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది.
లా విద్యార్థిని జిషా నిరుడు ఏప్రిల్ 28వ తేదీన శవమైన తేలిన విషయం తెలిసిందే. అమీరుల్ ఇస్లాం అస్సాం నుంచి వలస వచ్చిన కూలీ. నిరుడు కేరళలో 30 ఏళ్ల దళిత లా విద్యార్థినిపై అత్యాచారం జరగడమే కాకుండా ఆమె కిరాతకంగా హత్యకు గురైంది. ఈ కేసులో అమీరుల్ ఇస్లాం ఒక్కడే నిందితుడు.
దళిత విద్యార్థిని శవం 2016 ఏప్రిల్లో రక్తం మడుగులో పడి ఉంది. ఆ స్థితిలో జిషాను ఆమె తల్లి చూసింది. ఈ సంఘటన పెరంబవూరులోని వట్టోలిపాడిలో జరిగింది. హత్య గురించి ఇరుగుపొరుగువారికి ఏ విధమైన ఆనవాళ్లు కూడా దొరకలేదు. అరుపులు కూడా వారికి వినిపించలేదు.
అమీరుల్ ఇస్లాం అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పదునైన ఆయుధంతో చంపేశాడు. ఆమె శవం కనిపించిన 50 రోజుల తర్వాత పోలీసులకు అమీరుల్ ఇస్లాం పట్టుబడ్డాడు.
కేసు విచారణ ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభమై 85 రోజుల పాటు సాగింది. ప్రాసిక్యూషన్ వంద మంది సాక్షులను విచారించింది. ఐదు వేల మంది వేలిముద్రలను పరీక్షించారు.